పదవులు గడ్డిపోచతో సమానం, చంద్రబాబు ధర్మరాజులా వ్యవహించారు: టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ప్రత్యేకహోదా అంశం సోమవారం లోక్సభలో గందరగోళం సృష్టించింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ ఒకవైపు టీడీపీ ఎంపీలు, ఇంకొవైపు వైసీపీ ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ ప్రారంభం నుంచీ టీడీపీ ఎంపీలు ప్లకార్లులు చేతబూని ఏపీకు న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.
వీరి నిరసనలతో మధ్యాహ్నం 2గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం పార్లమెంట్ బయట టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ధర్మరాజులా వ్యవహారించి ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారని అన్నారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని పేర్కొన్నారు. మా మంచి తనానికి, సహనానికి పరీక్ష పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలోనే ఉంటూ ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడుతామని రాజమండ్రి ఎంపీ మురళీ మోహాన్ అన్నారు. అనకాపల్లి ఎంపీ మాట్లాడుతూ పదవులు తమకు గడ్డిపోచతో సమానమని వ్యాఖ్యానించారు.

అధినేత ఆదేశిస్తే పదవులను త్యజించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంలోనే ఉంటూ రాజీలేని పోరాటం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో కలిసి ఉంటూనే హోదాను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకుండా మద్దతు పలికామని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ సర్కార్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్కు హోదా సాధించి తీరుతామని పేర్కొన్నారు. అంచెలంచెలుగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
మరోవైపు క్వశ్చన్ అవర్లో టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు కూడా నినాదాలతో హోరెత్తించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ లోక్సభలో వైసీపీ ఎంపీలు సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఈ అంశంపై వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.
అనంతరం చర్చకు డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకెళ్లి 'న్యాయం చేయాలంటూ' నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఫ్లకార్డులను సైతం ప్రదర్శించారు. దీనిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని, జీరో జీవర్ లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications