Polavaram: జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్రం నిధులు: రీఎంబర్స్మెంట్ కోసం వెయిటింగ్: వైసీపీ ఎంపీలు
అమరావతి: రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు, నిధులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఢిల్లీ వేదికగా తమ గళాన్ని మరోసారి వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరామని లోక్సభలో వైఎస్సార్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన తోటి ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్, గొడ్డేటి మాధవి, డాక్టర్ బీవీ సత్యవతితో కలిసి మాట్లాడారు.

ఆమోదించడంలో జాప్యం ఎందుకు?
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90లో పొందుపరిచిన అంశాలను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని అన్నారు. వాటిని వెంటనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. పార్లమెంట్లో చేసిన చట్టాలను ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, ఇది సరైంది కాదని అన్నారు. తమ అభ్యంతరాన్ని కేంద్రానికి తెలిపామని చెప్పారు. గతంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, జల్శక్తి మంత్రిత్వ శాఖ కూడా సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. దానిపై ఆమోద ముద్ర వేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ..
పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో నిర్వాసితులకు పూర్తి న్యాయం దక్కుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో పోరాడుతున్నామని మార్గాని భరత్ చెప్పారు. కాఫర్ డ్యామ్ వద్ద 40 మీటర్లకు పైగా వరదనీరు నిల్వ ఉందని, స్పిల్ వే ద్వారా డెల్టా ప్రాంతానికి ఆ జలాలను మళ్లించినట్లు చెప్పారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విడుదల చేయడం వల్ల ముంపువాసులకు న్యాయం దక్కుతుందని ఆయన అన్నారు.

జాతీయ ప్రాజెక్ట్కు రాష్ట్ర నిధులా?
పోలవరం నిధుల బకాయిలను విడుదల చేయించుకోవడానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొస్తున్నామని మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం అడ్వాన్స్ రూపంలో రాష్ట్రానికి మంజూరు చేయాల్సి ఉండగా.. మోడీ సర్కార్ దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసి కేంద్రం నుంచి రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తోందని విమర్శించారు.

వైఎస్సార్ హయాంలో..
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా నష్టపోయిందని, అలాంటి రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మార్గాని భరత్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారని, నిర్మాణ పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు. ఇదివరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆయన కుమారుడు వైఎస్ జగన్ హయాంలో పూర్తవుతున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications