ఎమ్మెల్యే బరిలో వైసీపీ ఎంపీలు - ఎవరెక్కడ నుంచి..!?
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన సీఎం, పాలనా పరంగా ప్రక్షాళన ప్రారంభించారు. ఎన్నికల్లో అభ్యర్దుల ఎంపిక పైనా ఫోకస్ చేసారు. ఈ సారి టికెట్ ఆశిస్తున్న వారిలో సిట్టింగ్ ల వారసులతో పాటుగా తటస్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఇదే సమయంలో ప్రస్తుత ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కొందిరికీ అధినాయకత్వం నుంచి హామీ కూడా దక్కినట్లు తెలుస్తోంది. దీంతో, ఎమ్మెల్యే బరిలో దిగనున్న ఎంపీల జాబితాపైన చర్చ మొదలైంది.

అసెంబ్లీ రేసులో ఎంపీలు: 2019 ఎన్నికల్ల వైసీపీ 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అందులో నర్సాపురం ఎంపీ రఘురామ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన 21 మంది ఎంపీల్లో పలువురు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ మేనియాలో వీరంతా పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. రాజకీయంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారికి పార్లమెంట్ సభ్యులుగా అవకాశం దక్కింది.
ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వారిలో 11 మంది వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసి ఇప్పుడు ఎంపీలు అయిన వారు ఉన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే సీట్లు ఖరారు చేస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది.
అసెంబ్లీకే పోటీ చేస్తాం: ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా అరకు ఎంపీ మాధవి సైతం పాడేరు సీటు ఆశిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సీటు నుంచి పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
అమలాపురం ఎంపీ చింతా అనూరాధా రానున్న ఎన్నికల్లో రాజోలు, పీ గన్నవరం, అమలాపురం ఈ మూడు స్థానాల్లో ఒక చోట నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే, ఈ మూడు సీట్లలోనూ అవకాశం లేదని చెబుతున్నారు. విశాఖ ఎంపీ సత్యానారాయణ అవకాశం వస్తే విశాఖ తూర్పు నుంచి బరిలోకి దిగేందుకు సిద్దం అవుతున్నారు. అదే విధంగా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నూజివీడు అసెంబ్లీ సీటు పై ఆశలు పెట్టుకున్నారు.
సీఎం నిర్ణయం కోసం నిరీక్షణ: అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ సిద్దం చేసుకుంటున్నారు. హిందూపరం ఎంపీ గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి పోటీ చేయాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు ప్రారంభించారు. నెల్లూరు ఎంపీ ఆదాలకు పార్టీ నాయకత్వం అధికారికంగా నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగించిందది.
తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చే ఎన్నికల్లో గూడూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అదే విధంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సైతం అసెంబ్లీ బరిలో నిలుస్తారని చెబుతున్నారు. ప్రాంతీయ - సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లు ఖరారు చేయనున్న సీఎం జగన్..వీరిలో ఎంత మందిని అసెంబ్లీ బరిలో దించుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications