ఇక రాజీనామాలే: 'స్పీకర్ ఫార్మాట్'లోనే సిద్దం చేసి పెట్టుకున్న వైసీపీ ఎంపీలు..
న్యూఢిల్లీ: లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాల కంటే.. నిరవధిక వాయిదా వేయడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభ ఎప్పుడు నిరవధిక వాయిదా పడితే.. ఆ మరుక్షణమే రాజీనామాలు చేయడానికి సిద్దమైపోయారు వైసీపీలు.
ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్లో ఇప్పటికే వారు రాజీనామా లేఖలను సిద్దం చేసి పెట్టుకున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకుంటే రాజీనామా చేస్తామని. స్పీకర్ తోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెప్పారు.
అవిశ్వాస తీర్మానం విషయంలో వైసీపీ ఇప్పటికే విజయం సాధించింది అని మిథున్ రెడ్డి అన్నారు. ఐదుగురు ఎంపీలతో అవిశ్వాసం పెట్టి ఏం లాభం? అని ప్రశ్నించినవాళ్లే.. ఆ తర్వాత తమ బాటలో నడుస్తున్నారని గుర్తుచేశారు. తమ కంటే ఎక్కువ మంది ఎంపీలు ఉండి కూడా.. అటు కాంగ్రెస్ గానీ, ఇటు టీడీపీ గానీ చేయని సాహసాన్ని వైసీపీ చేసిందన్నారు.
ధైర్యంగా ముందుకెళ్తే.. అంతా కలిసొస్తారని జగన్ తమకు ధైర్యం చెప్పారని, చెప్పినట్టుగానే జరిగిందని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం ద్వారా హోదాపై రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తెలియజేయడమే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే.. ఇంకా ఎంపీ పదవుల్లో కొనసాగడం భావ్యం కాదన్న ఉద్దేశంతోనే రాజీనామాలకు సిద్దపడుతున్నామని తెలిపారు. మా ఒత్తిడికి తలొగ్గి కేంద్రం హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాజీనామాల వల్ల ఉపయోగం లేదంటున్నవారు.. ఇంతకుముందు అవిశ్వాస తీర్మానంపై కూడా అలాగే స్పందించారని గుర్తుచేశారు.
రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్తే.. ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భయం తమకు లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాము ముందుకు వెళ్తున్నాం కాబట్టి.. ఇదంతా తాము రిస్క్ గా భావించడం లేదని, ప్రజలు తమ వెంట ఉంటారన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.