అలా కలరింగ్ ఇచ్చుకున్న మెగాస్టార్: ఒక్క వీడియోతో..!!
Megastar Chiranjeevi: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
ఈ నేపథ్యంలో- మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన వీడియోను రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. ఈ వీడియోలో ఆయన తన తమ్ముడు, పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ వరకు మాత్రమే పరిమితమైనట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. 1:50 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అసాంతం చిరంజీవి.. పవన్ కల్యాణ్ను మాత్రమే ప్రస్తావించారు.

జనసేన గానీ, ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తోన్న 21 మంది అసెంబ్లీ, ఇద్దరు ఎంపీ అభ్యర్థుల గురించి మాట మాత్రం కూడా చెప్పలేదు చిరంజీవి. పిఠాపురంవాసులకు న్యాయం చేయడానికి పవన్ ఎంతవరకైనా వెళ్తాడని, ఎవరితోనైనా కలబడుతాడని అన్నారు. అందుకే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి, పవన్ కల్యాణ్ను గెలిపించాలంటూ మెగాస్టార్ పిఠాపురం ఓటర్లకు విజ్ఞప్తి చేశారంతే.
జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. చివర్లో ఈ వీడియోపై జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ను ప్రదర్శించారే తప్ప- కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల పేర్లు, ఎన్నికల గుర్తులు లేవు. కనీసం కూటమి సింబల్ కూడా కనిపించలేదు.
ఇది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి తన తమ్ముడికి మాత్రమే సపోర్ట్ చేశారనేది తేలిపోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కూటమికి దూరంగా ఉంటూనే పవన్ కల్యాణ్కు మాత్రమే ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించారని, ఇకపై ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా రాకపోవచ్చనీ అంటున్నారు.
ఈ వీడియోలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ స్పందించారు. తనదైన శైలిలో పవన్ కల్యాణ్, చిరంజీవిపై సెటైర్లు వేశారు. బతుకంతా భరణాలకే సరిపోయింది అని చెబితే బొత్తిగా బాగోదని, అందుకే కాస్త మొహమాటపడి తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేశాడంటూ చిరంజీవి కవర్ చేసుకున్నాడని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications