జగన్తో ఎంపీల భేటీ: పని తక్కువ, ప్రచారం ఎక్కువలా చంద్రబాబు తీరు
హైదరాబాద్: లోటస్ పాండ్ కార్యాలయంలో ప్రారంభమైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు అనుసరించాల్సి వ్యూహాలపై వైసీపీ అధినేత వైయస్ జగన్ చర్చించారు.
విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై పార్లమెంట్లో నిలదీయాలని ఎంపీలకు వైయస్ జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏపీలో ఆధికార పార్టీ టీడీపీ చేపట్టిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణపై పార్లమెంట్లో ప్రస్తావించాలని సూచించారు.
ఈ సమావేశానికి వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీలు మీడియా మాట్లాడుతూ సీఎం చంద్రబాబను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పని తక్కువ, ప్రచారం ఎక్కువ చందంగా చంద్రబాబు పాలన సాగుతోందని వారు విమర్శించారు. ఫిరాయింపు నిరోధక చట్టానికి సవరణలు చేయాలని, ఆ అంశాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్కు అప్పగించాలని గతంలోనే వైఎస్ జగన్ చెప్పారని అన్నారు.
దీనిపై విజయ సాయిరెడ్డి పార్లమెంట్లో ప్రయివేట్ మెంబర్ బిల్లు పెట్టబోతున్నారని ఎంపీ మేకపాట రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణకు అన్ని పార్టీల మద్దతు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ కోసం పార్లమెంటులో పోరు సాగించాలని నిర్ణయించామన్నారు.
ఇటీవలే పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైనా లోక్ సభ స్పీకర్కు ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.