సీఎం జగన్ నేడు తేల్చేస్తారా - షర్మిల టు విజయమ్మ : మళ్లీ అధికారమే లక్ష్యంగా..!!
వైసీపీ ప్లీనరీలో రెండో రోజు సమావేశాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. అట్టహాసంగా ప్రారంభమైన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో తొలి రోజున అయిదు తీర్మానాలను ఆమోదించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ప్రసంగించిన విజయమ్మ తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి సంచలనానికి కారణమయ్యారు. విజయమ్మ నిర్ణయం పైనే ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా హాజరైన సభ్యుల మధ్య చర్చ సాగింది.
అయితే, విజయమ్మ పూర్తి క్లారిటీతో తన రాజకీమాకు గల కారణాలను వివరించారని... పార్టీ పైన ఈ నిర్ణయం ఎమోషనల్ గా తప్ప..రాజకీయంగా నష్టం ఉండదని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక, రెండో రోజు సమావేశాల్లో భాగంగా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ కొనసాగేందుకు వీలుగా పార్టీ రాజ్యాంగ సవరణకు తొలి రోజున ప్రతిపాదన చేసారు. రెండో రోజు అయిన నేడు దీనికి ఆమోదం లభించనుంది.
సీఎం జగన్ కీలక ప్రసంగం
ఇక, ఈ రోజు సమావేశాల్లో మరో నాలుగు తీర్మానాలను ప్లీనరీ వేదికగా చర్చించి..ఆమోదించనున్నారు. అందులో రాజకీయ తీర్మానంలో భాగంగా ఎల్లో మీడియా - దుష్ట చతుష్ఠయం అనే అంశం పైన చర్చ జరగనుంది. దీని పైన చర్చలో మంత్రులు అంబటి రాంబాబు..జోగి రమేష్ తో పాటుగా కొడాలి నాని, పేర్ని నానితో సహా పోసాని సైతం ప్రసంగించనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడి హోదాలో ప్లీనరీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. అందులో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీల కూర్పు పైన విధాన పరమైన నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. అదే విధంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివిరస్తూ...కేంద్రంతో సంబంధాల పైన స్పష్టత ఇస్తూ.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ కేడర్ లో జోష్ పెంచే విధంగా జగన్ ప్రసంగం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆ ప్రచారానికి ముగింపు పలుకుతారా
ఇదే సమయంలో పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా సమయంలో ప్లీనరీ వేదికగా విజయమ్మ చేసిన ప్రసంగం పైన ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. నాడు చెల్లి షర్మిల..నేడు తల్లి విజయమ్మను జగన్ బయటకు పంపారంటూ ఆరోపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యవహారాల పైన జగన్ ఎక్కడా స్పందించ లేదు. అయితే, తమ కుటుంబం గురించి విజయమ్మ క్లారిటీ ఇచ్చారు.
విలువలకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంగా చెప్పుకొచ్చారు. అయితే, తన తల్లి నిర్ణయంతో పాటుగా షర్మిల గురించి చర్చకు ముగింపు ఇవ్వాలని వైసీపీ నేతలు సూచిస్తున్నట్లుగా సమాచారం. పూర్తిగా కుటుంబ పరమైన వ్యవహారాలు ఇప్పుడు రాజకీయ అంశాలుగా మారుతున్నాయని..ఈ మొత్తానికి ముగింపు ఇచ్చేలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని వైసీపీ సీనియర్లు చెబుతున్నారు.
జగన్ ఏం చెప్పబోతున్నారు
దీంతో..ఇదే వేదికగా షర్మిల రాజకీయ లక్ష్యం..తన నిర్ణయం వెనుక గల కారణాలను విజయమ్మ వివరించిన తరహాలోనే సీఎం జగన్ సైతం క్లారిటీ ఇస్తారనే అభిప్రాయం కొందరు సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగన్ అందుకు సిద్దంగా ఉన్నారా..అసలు ఈ వ్యవహారాల పైన ఆయన స్పందిస్తారా అనేది సందేహమే.
ఇక, సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి.. ముందస్తు ఎన్నికల పైన జరుగుతున్న ప్రచారం.. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే ప్రతిపక్ష నేతల లక్ష్యం.. కేంద్రంతో సంబంధాల పైన సీఎం తన ప్రసంగంలో క్లారిటీ ఇవ్వనున్నారు. అదే విధంగా పాలనా పరంగా ఈ మూడేళ్లలో అమలు చేసిన నిర్ణయాలు..రానున్న రెండేళ్ల కాలంలో తన ప్రణాళికలను సైతం సీఎం జగన్ పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.