వైయస్కు నివాళి: గుండెల్లో అంటూ ట్వీట్, ఇంటికో విమానమంటూ బాబుపై జగన్ నిప్పులు
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని వైసీపీ అధినేత వైయస్ జగన్ పేర్కొన్నారు. శుక్రవారం వైయస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబీకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైయస్ఆర్ తనయుడు, వైసీపీ అధినేత వైయస్ జగన్ కొందరు భౌతికంగా మనను విడిచి వెళ్లినా ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రితో గల అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ఆశయ సాధనకు జీవితాంతం కృషి చేస్తానని అన్నారు.
అనంతరం ఇడుపులపాయ గ్రామంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని, మొత్తం లక్షా 45 వేల కోట్ల రూపాయల అవినీతికి శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై చంద్రబాబును నిలదీయాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని అన్నారు.
లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇంటికో కారు లేదంటే ఏకంగా విమానమే ఇస్తామని చంద్రబాబు చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రజలకే బ్యాలెట్ ఇస్తున్నామని, వంద మార్కులకు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పాలని కోరుతామని తెలిపారు.
గత ఎన్నికల సమయంలో రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పటివరకు ఎవరికీ రుణాలు మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. మోసం చేసేవారిని ఎక్కడికక్కడ నిలదీస్తేనే మార్పు వస్తుందని అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో ప్రతిచోటా తాను పాల్గొంటానని చెప్పారు.
అంతక ముందు శుక్రవారం ఉదయం అసంఖ్యాకమైన వైయస్ఆర్ అభిమానులు ఇడుపులపాయకు బారులుదీరగా, అధినేత వైయస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. ఆయన వెంట భార్య భారతి, వైఎస్ సతీమణి విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనీల్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైయస్ఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ పార్టీ జెండాలను కూడా ఆవిష్కరించారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
Some people live forever in the hearts of all those they leave behind. Fondly remembering and missing my father, on his birthday.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2016