పులివెందుల ప్రకంపనలు- ఆరా తీసిన జగన్
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. పలు చోట్ల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ పరిణామాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఇందులో పాల్గొన్నారు. పులివెందులలో స్వేచ్ఛాయుత వాతావరణం పోలింగ్ జరట్లేదని ఆరోపించారు. నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్లను తీసుకొచ్చి టీడీపీ నాయకులు ఓటు వేయిస్తోన్నారని విమర్శించారు.
ఒక్కో గ్రామంలో 100 నుంచి 300 మంది వరకు బయటి వ్యక్తులను రప్పించారని, వాళ్లతోనే తమకు అనుకూలంగా ఓటు వేయించుకుంటోన్నారని ధ్వజమెత్తారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఉందని వ్యాఖ్యానించారు.
బయటి వ్యక్తులతో వైఎస్ఆర్సీపీ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని, పోలీసులు కూడా టీడీపీకే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలపై ఇకనైనా ఎన్నికల కమిషన్ కళ్లు తెరవాలని, తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో టీడీపీ అరాచకాల ఆధారాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచి.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతోందని, ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ వారిని పెట్టిందని అన్నారు.
అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసిన టీడీపీ నేతలు జమ్మలమడుగు వాళ్లకు ఓటరు స్లిప్పులను ఇచ్చి ఓటు వేయడానికి పంపిస్తున్నారని, దొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదంటూ టీడీపీ నేతలు పంపిస్తున్నారని అన్నారు.
నల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలు మోహరించారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టిన టీడీపీ నేతలు ఎవర్నీ రానివ్వట్లేదని, కర్రలు, రాడ్లతో పహారా కాస్తున్నారని, పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు.
ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్వీ సతీష్ రెడ్డి, ఇతర నాయకులతో మాట్లాడారని సమాచారం.












Click it and Unblock the Notifications