నీవల్ల కాదంటే...: బాబు పైకి పవన్ కళ్యాణ్ను రెచ్చగొడ్తున్న జగన్!!
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తెరపైకి తీసుకు రావడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మరింత ఇరుకున పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
వైసిపి నేతలు ఇటీవల పవన్ కళ్యాణ్ పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు వైఫల్యాల పైన పవన్ కళ్యాణ్ గొంతు విప్పాలని, ఆయన నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలోను పవన్ స్పందించాలని వైసిపి నేత అంబటి రాంబాబు ఈరోజు డిమాండ్ చేశారు.
అయితే, పవన్ కళ్యాణ్ను ఒక్కడినే అంటే బాగుండదనో మరే కారణమో కానీ.. అంబటి మాట్లాడుతూ... ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలని, రాజకీయ నాయకులు అందరూ స్పందించాలని, లేదంటే నేరస్తులు అవుతారని వ్యాఖ్యానించారు.
అంతకుముందు కూడా వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ పేరును పదేపదే ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. కాల్ మనీ సెక్స్ రాకెట్, అమరావతిలో వైసిపి ఆరోపించిన భూదందా తదితర ఎన్నో అంశాల పైన పవన్ స్పందించాలని వైసిప మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబును నిలదీయకపోవడం పైన తనదైన శైలిలో వైసిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
చంద్రబాబు వైఫల్యాలను నిలదీసేందుకు పవన్ కళ్యాణ్కు డబ్బులు అవసరమా అని నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. తన వద్ద డబ్బులు లేవని, తాను 2019లో పోటీ చేస్తానని పవన్ చెప్పారు.
దీంతో, వైసిపి దానికి కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు కావాలని, చంద్రబాబు వైఫల్యాలను నిలదీసేందుకు డబ్బులు అవసరం లేదని, అలాగే 2019లో పోటీ చేయాలనుకున్న పవన్ ప్రభుత్వం వైఫల్యాల పైన ప్రశ్నించాలని వైసిపి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి.
అంతేకాదు, ప్రత్యేక హోదా తదితర ఏ సమస్య పైన అయినా పవన్ కళ్యాణ్ పోరాడలేకుంటే కనీసం పోరాడే వారికి మద్దతివ్వాలని గతంలో వ్యాఖ్యానించారు. తద్వారా వైసిపికి పవన్ మద్దతివ్వాలని వారు పరోక్షంగా అభిప్రాయపడ్డారు. మొత్తానికి, చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ను పురిగొల్పి మరింత సొమ్ము చేసుకునేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.