పార్టీ ముఖ్యం కాదు: జగన్ పార్టీ రెబెల్ ఎంపి గీత
కాకినాడ: నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తానని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ గంగవరం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గీత పాల్గొన్నారు.
తాను ఏ పార్టీలో ఉన్నాననే దానికి సంబంధం లేకుండా తనను గెలిపించిన ప్రజల కష్టాలను తొలగించడమే తన కర్తవ్యమన్నారు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మంచి సంకల్పంతో స్వచ్ఛభారత్కు పిలుపునిచ్చారని ఎంపీ కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆశ్రమ బాలికల పాఠశాలలోని విద్యార్థులతో, కొత్తపల్లి గీత స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు.

పాఠశాల దేవాలయంతో సమానం కాబట్టి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు ఎంపీ వెంట ఉన్నారు. కొత్తపల్లి గీత వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరమైన తెలుగుదేశం పార్టీకి దగ్గరైన విషయం తెలిసిందే. ఆమె వైయస్ జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి జీరోబేస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ప్రజలపై పన్నులు వేయకుండా పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఆదాయం తక్కువైనా పనులు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించడంతోపాటు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం మెరుగైన బడ్జెట్ను రూపొందిస్తున్నామని యనమల వివరించారు.












Click it and Unblock the Notifications