షర్మిల పొలిటికల్ స్టీరింగ్ ఏపీ వైపు: ఆ రోజు ఎంతో దూరంలో లేదు: ఆమె వస్తే..వైసీపీ క్లోజ్: రఘురామ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందిన నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులపై వివాదాస్పద ప్రకటనలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న ఆయన ఈ దఫా తన రూటు మార్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్ చెల్లెలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పొలిటికల్ కేరీర్పై జోస్యం చెప్పారు.
Recommended Video
తెలంగాణలో సంచలనంగా..
తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల సంచలనాలకు కేంద్రబిందువు అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై రోజూ నిప్పులు చెరుగుతున్నారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, అన్నదాతల ఆత్మహత్యలు.. వంటి సామాజికాంశాలను ఆమె తన రాజకీయాస్త్రాలుగా మలచుకున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలను చేపడుతున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆరా తీయడానికి, గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకోవడానికి పాదయాత్ర నిర్వహించారు.
రైతు ఆవేదన యాత్రలతో జనంలోకి..
ప్రస్తుతం వైఎస్ షర్మిల- రైతు ఆవేదన యాత్రలను నిర్వహిస్తోన్నారు. ఈ నెల 19వ తేదీన ఈ యాత్రలను ఆరంభించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శిస్తోన్నారు. ప్రస్తుతం తెలంగాణకే పరిమితమైన వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం క్రమంగా ఏపీలోనూ విస్తరించే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే దిశగా ఆమె పావులు కదుపొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
ఆ రోజు ఎంతో దూరంలో లేదు..
తాజాగా- రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు కేంద్రబిందువు అయ్యాయి. వైఎస్ షర్మిల.. ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదని తేల్చి చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ అధినేత నిర్వహించిన ఇంటర్వ్యూలో రఘురామ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ పార్ట్-2 రూపంలో ఈ ఆదివారం ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రొమోను ఆ మీడియా హౌస్ యాజమాన్యం విడుదల చేసింది. 3 నిమిషాల 14 సెకెన్ల నిడివి ఉన్న ఈ ప్రొమోలో రఘురామ పలు కీలక అంశాలపై స్పందించారు.
షర్మిల ప్రకటనలతో వైసీపీకి డ్యామేజ్
తెలంగాణలో వైఎస్ షర్మిల ఇస్తోన్న ప్రకటనలు, చేస్తోన్న విమర్శలు- వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేస్తోన్నాయని రఘురామ అన్నారు. స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల తన రాజకీయ స్టీరింగ్ను ఏపీ వైపు తిప్పే రోజు ఎంతో దూరంలో లేదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టకూడదనే తాను కోరుకుంటున్నానని, ఆమె వస్తే వైసీపీ గ్యారంటీగా దెబ్బతింటుందని రఘురామ స్పష్టం చేశారు.
సంక్రాంతి నాటికి మంచి రోజులు..
తనకు సాధారణంగా కోడి పందేల్లో పాల్గొనడం అంటే చాలా ఇష్టమని, ప్రస్తుతం తాను నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని రఘురామ అన్నారు. సంక్రాంతి నాటికి- తాను నియోజకవర్గానికి వెళ్లడానికి వీలుగా మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పారు. కాలం కలిసిరాకపోతే ఢిల్లీలోనే కోడిపందాలు ఆడేస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు రఘురామ అవునంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు.
ఆ రాత్రి కరెంటు తీసేసి..
తనకు బెదింపులు తీవ్రం అయ్యాయని రఘురామ అన్నారు. బూతు రత్న, బూతు శ్రీ, విగ్గురాజు, విగ్గుగాడు అనే అవార్డులను తమ పార్టీ వాళ్లు ప్రవేశపెట్టొచ్చని చెప్పారు. పొట్టిగా ఉన్నవాడు హీల్ పెట్టుకుంటాడు.. బట్టతల ఉన్నవాడు విగ్గు పెట్టుకుంటాడు అందులో తప్పేం ఉంది? అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మీరు (వైఎస్ జగన్) పొట్టిగా ఉన్నానని అన్నామా? అని చెప్పారు. ఒక దశలె తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. గుండెల మీద కూర్చున్నారని పేర్కొన్నారు. తనను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ లోక్సభ సభ్యత్వం నుంచి డిస్ క్వాలిఫై చేయలేదని అన్నారు.