వైఎస్ భారతి కంపెనీలను టార్గెట్ చేసిన రఘురామ: సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో లింక్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందిన నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు విమర్శలు సంధించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంలో జగన్ సర్కార్ అనుసరిస్తోన్న వైఖరిని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు విక్రయించే ఉత్పత్తుల ధరలకు లింక్ పెట్టారు.
రామతీర్థం ఉదంతంలో కీలక మలుపు: అశోక్ గజపతిరాజు సంచలన నిర్ణయం: హైకోర్టు జోక్యానికి
మరింత రాజుకున్న వివాదం..
రాష్ట్రంలో కొంతకాలంగా ప్రభుత్వానికి- తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దల మధ్య టికెట్ల రేట్ల విషయంలో విభేదాలు నడుస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దు మణిగినట్టు భావించినప్పటికీ- సినిమా హాళ్లల్లో అధికారులు చేస్తోన్న తనిఖీలు మింగుడు పడని పరిస్థితిని కల్పించింది. లైసెన్సులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తోన్న సినిమా హాళ్లల్లో అధికారులు తమ తనిఖీలను విస్తృతం చేశారు.
నిబంధనల ఉల్లంఘన..
నిబంధనలను పాటించని థియేటర్ల యాజమాన్యాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పలు థియేటర్లను సీజ్ చేశారు. ఈ దాడులు మరింత ఉధృతం అయ్యాయి. సంక్రాంతి సీజన్ వరకు స్పెషల్ డ్రైవ్గా దీన్ని చేపట్టింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తోన్న సినిమా హాళ్లను మూసివేయించారు. అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సీసీటీవీల లేని థియేటర్లు చాలా వెలుగులోకి వచ్చాయి.
పలు థియేటర్లు సీజ్..
రామకృష్ణా పిక్చర్ ప్యాలెస్, శ్రీ వెంకటేశ్వర టాకీస్-అవనిగడ్డ, నటరాజ్ థియేటర్, దుర్గా మహల్ థియేటర్-బంటుమిల్లి, సాగర్ పిక్చర్ ప్యాలెస్-చల్లపల్లి, లక్ష్మీ థియేటర్-కోడూరు, సత్యసాయి సినీ థియేటర్-మొవ్వ, శాంతి థియేటర్-నాగాయలంక, బొమ్మరిల్లు మినీ-గుడివాడ, గగన్ మహల్-పామర్రు, శైలజ- విజయవాడ సెంట్రల్, సంఘమిత్ర-మైలవరం మూత పడ్డాయి. శైలజ థియేటర్ యాజమాన్యంపై అధికారులు 20 వేల రూపాయల జరిమానా విధించారు.
రాజకీయ రంగు..
ఈ వ్యవహారం కాస్తా పూర్తిస్థాయిలో రాజకీయ రంగును పులముకొంది. ప్రముఖ నటుడు నాని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసినట్టయింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్- నాని వ్యాఖ్యలకు స్పందించారు. వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. రెండు రోజులుగా రాష్ట్రంలో ఈ విషయమే హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లకు దారి తీసింది.
రఘురామ జోక్యంతో..
తాజాగా- రఘురామ కృష్ణంరాజు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు అండగా నిలిచారాయన. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన కంపెనీలను టార్గెట్గా చేసుకున్నారు. ఆయా కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తుల రేట్లతో ముడిపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి సారథ్యాన్ని వహిస్తోన్న సాక్షి మీడియా హౌస్, భారతి సిమెంట్స్పై కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్కు చెందిన పవర్ ప్రాజెక్టులతోనూ లింక్ పెట్టారు.
మీరు పెంచడం.. సినిమా హాళ్లు తగ్గించడం..
మీ పత్రిక ధర పెంచేది- పేపర్ నాణ్యత ప్రమాణాలను కాపాడటానికి, ప్రజలకు మెరుగైన వార్తలను అందించడానికి. మీ సిమెంట్ ధర పెంచేది- నాణ్యత ప్రమాణాలను కాపాడటానికి, ప్రజలకు మెరుగైన సిమెంట్ను అందించడానికి..మీ కంపెనీలు అమ్మే విద్యుత్ రేటును పెంచేది -పేపర్ నాణ్యత ప్రమాణాలను కాపాడటానికి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలను అందించడానికి..మరి నిర్మాతలు- వాళ్ల సినిమా రేట్లను తగ్గించేది- సినిమా హాళ్లల్లో నాణ్యత ప్రమాణాలను పెంచడానికి, ప్రజలకు మెరుగైన వినోదాన్ని అందించడానికి ఏంటో మరి అంటూ ఎద్దేవా చేశారు.