Raghuram Raju: వచ్చే ఎన్నికల్లో పోటీపై రఘురామ క్లారిటీ..!
ఏపీలో వైసీపీ నుంచి గెలిచి నాలుగేళ్లుగా ఆ పార్టీతోనే విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎట్టకేలకు ఇవాళ తిరిగి రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గంలో నాలుగేళ్లుగా సంక్రాంతికి కూడా దూరమైన ఆయన ఇవాళ పండుగ కోసం భీమవరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో పరిస్ధితులపై స్దానికులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీపై తన అభిప్రాయాన్ని కూడా వారితో పంచుకున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం సీటు నుంచే లోక్ సభకు పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన రఘురామకృష్ణంరాజు.. ఏ పార్టీ నుంచి అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవాళ మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రంగంలోకి దిగబోతున్నట్లు రఘురామ ప్రకటించారు. ఏ పార్టీ తరఫున అనేది కాకుండా ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నట్లు రఘురామ సంకేతం ఇచ్చారు.

తాను అవకాశ వాదిని కానని, అలా అయి ఉంటే వైసీపీ నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత విభేదించి నాలుగేళ్లు బయటికి వచ్చేవాడిని కాదని రఘురామరాజు తెలిపారు. అమరావతిపై జగన్ మాట మార్చడం వల్లే తాను వైసీపీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీకి రఘురామ సిద్ధంగా ఉండటంతో టీడీపీ కానీ, జనసేన కానీ అక్కడ ఇన్ ఛార్జ్ ల గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. గతంలో నాగబాబు పోటీ చేసిన సీటు కూడా అయిన నరసాపురంలో ఈసారి జనసేన మద్దతు కూడా లభిస్తే రఘురామకు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications