సంక్రాంతికి సొంత నియోజకవర్గానికి రఘురామ-రెండేళ్ల విరామం తర్వాత తొలిసారి
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే రెండేళ్లుగా పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం నరసాపురానికి సైతం దూరమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై పోరు ప్రారంభించిన తర్వాత సొంత పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకు ఆయన కంటగింపుగా మారారు. ఈ క్రమంలో తనపై దాడులు జరగొచ్చనే భయంతో ఆయన ఏకంగా ఢిల్లీకి మకాం మార్చేశారు. మధ్యలో హైదరాబాద్ కూడ వచ్చి వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి కేంద్రం నుంచి వై ప్లస్ కేటగిరీ భద్రత కూడా తీసుకున్న రఘురామ.. నరసాపురానికి మాత్రం రాలేకపోతున్నారు.
తాజాగా వైసీపీ ప్రభుత్వంపై సాగిస్తున్న పోరుకు ఫుల్ స్టాప్ పెట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న రఘురామరాజు.. అదే క్రమంలో సొంత నియోజకవర్గం నరసాపురానికి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 13న ఆయన నరసాపురం రానున్నట్లు ఇవాళ ప్రకటించారు. వైసీపీతో పోరు కారణంగా రెండేళ్లుగా సంక్రాంతి వేడుకలకు కూడా దూరమవుతున్న ఆయన... ఈసారి మాత్రం ఎలాగైనా వచ్చి తీరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న నరసాపురం వచ్చి రెండు రోజుల పాటు అక్కడే ఉంటానని ఇవాళ ప్రకటించారు.

రెండేళ్ల విరామం తర్వాత నరసాపురానికి వస్తున్న రఘురామరాజు.. తాను అక్కడ ఉండే రెండు రోజుల పాటు రాష్ట్ర పోలీసులు తనకు భధ్రత కల్పించాలని కోరారు. అమరావతి అజెండాతో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తిరిగి పోటీ చేసి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామ నరసాపురం రాక ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ప్రతీ ఏటా సంక్రాంతికి నరసాపురం చుట్టుపక్కల జరిగే కోడి పందాల్లో పాల్గొనడం, సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకోవడం రఘురామకు అలవాటుగా వస్తోంది. రెండేళ్ల విరామం తర్వాత మరోసారి రఘురామ సంక్రాంతిలో పాల్గొనబోతున్నారు.












Click it and Unblock the Notifications