వెంటాడుతున్న రఘురామ..సీఐడీకి లీగల్ నోటీసులు : ఆ ఫోన్ లోనే మొత్తం సమాచారం : ముఖ్యమంత్రే లక్ష్యంగా.!!
రాష్ట్ర వ్యాప్తంగా..జాతీయ స్థాయిలో చర్చకు కారణమైన రఘురామ రాజు అంశం లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రఘురామ రాజు ఇప్పటికే ఏపీ సీఐడీ..ప్రభుత్వం పైన ఢిల్లీలో పలువురికి వరుసగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు తనను విచారించిన సీఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు.
ఆ కోడ్ కోసమే హింసించారు: రఘురామ
రఘురామ రాజు అరెస్ట్ సమయంలో తీసుకున్న వస్తువులు..అందులో ప్రధానంగా ఆయన మొబైల్ ను తీసుకున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ మొబైల్ లో కీలక సమాచారం ఉందని నోటీసులో వివరించారు. ఆ ఫోన్ తో పాటుగా తీసుకున్న వస్తువులు మెజిస్ట్రేట్ వద్ద జమచేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇతర సమాచారం తో పాటుగా ఆ మొబైల్ కోడ్ కోసమే రఘురామను కస్టడీలో హింసించారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే, రఘురామను అరెస్ట్ చేసిన సమయంలో ఆ మొబైల్ విచారణకు కీలకంగా చెప్పుకొచ్చారు.
లేఖలు-ఫిర్యాదులు
రఘురామ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు...ఆయనకు సాంకేతికంగా సహకరించేదెవరు అనే అంశాల పైన ఆయన మొబైల్ ఆధారంగా విచారణ కొనసాగుతుందనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాలతో రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించటం..కండీషన్లతో బెయిల్ రావటంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన వరుసగా కేంద్ర మంత్రులు.. జాతీయ మానవ హక్కుల సంఘం..ఎంపీలకు తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ లేఖల ద్వారా ఫిర్యాదులు చేసారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్...మరో ఎంపీ సుమలత ఆ లేఖలపైన స్పందించారు. సీఐడి అదనపు డీజీతో పాటుగా మంగళగిరి సీఐడీ ఎస్హెచ్ వోకు సైతం నోటీసులు పంపారు. ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ ఆస్పత్రి అధికారులతో ...టీటీడీ లో పని చేస్తున్న ధర్మారెడ్డి టచ్ లో ఉంటూ వారి పైన ఒత్తిడి తెచ్చారంటూ నేరుగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రఘురామ ఫిర్యాదు చేసారు. ధర్మారెడ్డి కారులో తిరుపతి నుండి సికింద్రాబాద్ వచ్చారనే ఆధారాలు ఇచ్చారని చెబుతున్నారు.
ప్రభుత్వమే టార్గెట్గా....
ఇక, తనను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కాగానే గుంటూరు తీసుకెళ్లేందుకు 15 మంది పోలీసులు ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారని..వారి మెస్ బిల్లులు సైతం తానే కట్టానంటూ రఘురామ కేంద్ర మంత్రికి బిల్లుల ఆధారాలు అందించారు. ఇది పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం చర్చకు కారణమైంది. ఇక, ఇప్పుడు విచారణలో కీలకమైన మొబైల్ ఫోన్ గురించి రఘురామ నేరుగా సీఐడి ఏడీజీకి నోటీసులు ఇవ్వటంతో... దీనికి ఏ రకమైన సమాధానం సీఐడి ఇస్తుందనేది చూడాల్సి ఉంది. ఇదే సమయంలో ఢిల్లీ నుండి ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటమే లక్ష్యంగా రఘురామ పలు విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. మెజిస్ట్రేట్ రామక్రిష్ణ ను జైల్లో ఉంచిన విషయం పైన గవర్నర్ కు లేఖ...అమూల్ సంస్థతో ప్రభుత్వ ఒప్పందాల పైన హైకోర్టులో పిటీషన్ వంటి వ్యవహారాలతో ప్రభుత్వమే టార్గెట్ గా రఘురామ వ్యవహరిస్తున్నారు. మరి.. ఏపీ ప్రభుత్వం ఈ రెబల్ ఎంపీ విషయంలో ఏం చేస్తుందనేది వేచి చూడాల్సిందే.
Recommended Video