విజయవాడ బెంజి సర్కిల్ పేరు మార్పు ? కాకాణి విగ్రహం పునప్రతిష్టాపన ! ఐదేళ్ల తర్వాత..
దశాబ్దాలుగా విజయవాడ బెంజి సర్కిల్ కు జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాణి వెంకటరత్నం విగ్రహం ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలన్నీ బెంజి సర్కిల్ మీదుగా వెళ్లే క్రమంలో కాకాణి విగ్రహం అక్కడ ప్రత్యేకంగా కనిపించేది. కానీ దాన్ని ఐదేళ్ల క్రితం బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా తొలగించారు. ఇప్పుడు దాన్ని తిరిగి ప్రత్యేకంగా చేయించి అక్కడ ప్రతిష్టించారు. దీంతో పాటు బెంజిసర్కిల్ పేరు మార్పుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
దశాబ్దాలుగా విజయవాడ బెంజి సర్కిల్ లో ఉన్న దివంగత నేత కాకాణి వెంకటరత్నం విగ్రహాన్ని 2018 మేలో బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో అక్కడ నుంచి తొలగించాల్సి వచ్చింది.అయితే దీనిపై అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. కానీ ప్లైఓవర్ నిర్మాణం తర్వాత కాకాణి విగ్రహం తిరిగి పెడతామని అప్పటి మంత్రి దేవినేని ఉమ హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారడంతో దాన్ని వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఐదేళ్ల తర్వాత ఇవాళ తిరిగి కాకాణి విగ్రహాన్ని బెంజి సర్కిల్లో పెట్టారు.

జై ఆంధ్ర ఉద్యమ నేత అయిన కాకాణి వెంకటరత్నం విగ్రహాన్ని తిరిగి బెంజ్ సర్కిల్లో పెట్టాలనే డిమాండ్లు భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కార్పోరేషన్ కౌన్సిల్లో వైసీపీ తీర్మానం చేసింది. దీనికి అనుగుణంగా ఇక్కడ విగ్రహం పునప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్,విగ్రహ కమిటి ఛైర్మన్ కాకాణి తరుణ్, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు, కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ బుడ్డి, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు.
కౌన్సిల్ లో తీర్మానం చేసి కాకాణి విగ్రహం ఇక్కడ స్థాపించినట్లు దేవినేని అవినాష్ తెలిపారు. అభివృద్ది పనుల పేరుతో గతంలో తీసివేసిన విగ్రహాలు సీఎం జగన్ సూచన మేరకు పునః ప్రతిష్ట చేస్తున్నామన్నారు. కాకాణి విగ్రహం ఏర్పాటుకి పూర్తిగా సహకరించిన సీఎం జగన్ కు అయన కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప వాళ్ల గురించి భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాకాని కుటుంబ సభ్యులు విగ్రహం కోసం చాలా కష్టపడ్డారన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పని చేశారని, రాబోయే రోజుల్లో దీనిని కాకాణి సర్కిల్ గా నామకరణం చేసే విధంగా కార్పోరేషన్ లో కృషి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications