సాగు చట్టాల రద్దుపై స్పందించిన వైసీపీ ... రాష్ట్ర వ్యాప్తంగా నేడు రైతు సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలు
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రైతులు కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంతో సంబరాల్లో మునిగి తేలారు. దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులలో ఏడాది కాలంగా సాగు చట్టాల రద్దుకు ఆందోళన చేస్తున్న అన్నదాతల పోరాటానికి ఎట్టకేలకు ప్రధాని ప్రకటనతో ఫలితం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలందరూ స్వాగతించిన విషయం తెలిసిందే. ఇక అధికార వైసిపి మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై మొదటిసారి స్పందించింది.
రైతుల విజయానికి మద్దతుగా ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించిన వైసిపి శనివారం రోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది. రైతాంగం సాధించిన విజయానికి మద్దతుగా నవంబర్ 20 శనివారం నాడు రాష్ట్రంలోని 175 శాసనసభా నియోజకవర్గాలలో రైతు సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు.

మహాత్మాగాంధీ స్ఫూర్తిని, శక్తిని ప్రతిబింబించేలా, భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఓ గొప్ప విజయాన్ని సాధించిన రైతాంగానికి మద్దతుగా కొవ్వొత్తులతో రైతు సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అన్నదాతల ఆకాంక్షలు ఫలించడం, సాగు చట్టాలు రద్దు కావడం శుభపరిణామమని పేర్కొన్న ఆయన, సాగు చట్టాల రద్దు ఫలితంగా రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో రైతే రాజు అన్నది మరోమారు నిరూపించబడింది అని భావిస్తున్నాము అంటూ వెల్లడించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సాగు చట్టాల రద్దు కోసం రాష్ట్రంలో జరిగిన బంద్ లకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిన సంగతిని గుర్తు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి నేడు రైతు సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహించి అన్నదాతల పక్షాన వైసిపి ఉందని తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏడాది పాటు సాగు చట్టాలపై పోరాటం సాగించిన రైతులకు అభినందనలు తెలుపుతూనే ప్రత్యర్థి పార్టీలు 700 మంది రైతులు ఆందోళనలో ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. పోయిన వారి ప్రాణాలు ప్రధాని తెచ్చి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications