టీడీపీ నేత పట్టాభికి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ
అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. ఆయనపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు. ఆయనను చంద్రబాబు బానిసగా, పెయిడ్ ఆర్టిస్ట్గా అభివర్ణిస్తోన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ జగన్-వైఎస్ భారతి జైలులో కాపురం పెట్టాల్సి ఉంటుందంటూ పట్టాభి చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత స్పందించారు. వివేకానందరెడ్ హత్య జరిగినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపకుండా వివేకా హత్యోదంతాన్ని రాజకీయంగా వాడుకుంటోన్నాడంటూ మండిపడ్డారు.

ఈ హత్యతో వైఎస్ భారతికి ఎలాంటి సంబంధం లేదని, ఇన్ని రోజులూ ఆమె పేరు కూడా ఎత్తని టీడీపీ నాయకులు, ఇప్పుడెందుకు ప్రస్తావిస్తోన్నారని ప్రశ్నించారు. పట్టాభి.. చంద్రబాబు వద్ద డబ్బులకు పని చేసే పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎదురుదాడి చేశారు. ఆయనపై ప్రేమ ఉంటే బూట్లు నాకాలని హితవు పలికారు. పట్టాభి వంటి పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తోన్న చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తోన్నాడని, ఎన్టీ రామారావు వెన్నుపోటు నుంచే అతనికి అలవాటని ధ్వజమెత్తారు.
చంద్రబాబు రాజకీయ నేపథ్యం అంతా కుట్రలు కుతంత్రాలేనని, ఎన్టీఆర్కు చావుకు కారణం అయ్యాడని విమర్శించారు. 420 రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణించారు. పట్టాభి వంటి పెయిడ్ ఆర్టిస్టులు, దుష్ట చతుష్టయం చేస్తున్న తంతును ప్రజలు గమనిస్తోన్నారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు పట్టాభి వంటి పెయిడ్ ఆర్టిస్టులకు చీపుర్లతో సన్మానం చేస్తారని అన్నారు.
చంద్రబాబు రాజకీయ జీవితం అంతా వెన్నుపోటు చరిత్రేనని, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం, కులాలను అవమానించడం ఆయనకు అలవాటేనని పోతుల సునీత విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజల ముందుకు వెళ్తున్నారో అర్ధం కావట్లేదని చెప్పారు. తన అనుకూల మీడియా అండతో లేని విషయాలను ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనుకోవడం చంద్రబాబు భ్రమేనని అన్నారు.

చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ ఏం ఉద్ధరించారని ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారని ప్రశ్నించారు. పక్కరాష్ట్రంలో నివసిస్తూ ఏపీలో రాజకీయాలు చేసే తండ్రీ కొడుకులు 2024 తరువాత శాశ్వతంగా రాజకీయాలకు గుడ్బై చెబుతారని అన్నారు. ప్రజలు తమ పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు ఇస్తారంటూ సర్వేలు స్పష్టం చేస్తోన్నాయని, అందుకే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టిందని చెప్పారు.












Click it and Unblock the Notifications