రాజధానులపై కొత్త చట్టంలో మార్పులు ? సజ్జల లీకులు- సుప్రీంకు ఏం చెప్పబోతున్నారు ?
ఏపీలో అమరావతి రాజధానిని సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు తాజాగా స్టే ఇచ్చింది. ఇది వైసీపీ ప్రభుత్వానికి ఊరటగా మారింది. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి హైకోర్టు పెట్టిన గడువును సుప్రీంకోర్టు ఎత్తేసింది. అదే సమయంలో మిగతా అంశాలపై మాత్రం విచారణ జరపాల్సి ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వినిపించబోయే వాదనలు కీలకంగా మారాయి.
సుప్రీం ఆదేశాలతో మారుతున్న వ్యూహాలు
అమరావతి రాజధానిలో నిర్మాణాలకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, అలాగే విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కారులో ఆనందాన్ని నింపాయి. అదే సమయంలో రాజధానుల ఏర్పాటు కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో మార్గదర్శనం కూడా చేశాయి. దీంతో వైసీపీ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో తెరపైకి వచ్చిన అంశాల ఆధారంగా భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతోంది.
కొత్త బిల్లుపై సజ్జల లీకులు ?
ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీసుకురావాల్సిన బిల్లు విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఓ వ్యాఖ్య చేశారు. ఈసారి రాజధానుల బిల్లు పకడ్బందీగా ఉంటుందని, ఇది న్యాయప్రక్రియకు, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుందంటూ సజ్జల వ్యాఖ్యానించారు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా ఈ బిల్లుకు రూపకల్పన చేస్తామని సజ్జల వెల్లడించారు. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి మూడు రాజధానుల ప్రక్రియను పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పుడు సజ్జల కామెంట్స్ పై చర్చ మొదలైంది.
అమరావతిపై స్టాండ్ మారుతుందా ?
అలాగే మూడు రాజధానుల బిల్లులోనూ అమరావతిపైనా వైసీపీ సర్కార్ వైఖరి మారబోతున్నట్లు తెలుస్తోంది. అమరావతి రాజధానికి రైతులు భూములిచ్చింది నిజమేనని, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందేనని సజ్జల మరో కీలక వ్యాఖ్య చేశారు. దీంతో అమరావతి విషయంలో రాజధానుల బిల్లులో ప్రత్యేకంగా వరాలు ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే అమరావతి రైతులకు తాము కౌలు మరో ఐదేళ్లు పెంచిన విషయాన్ని సజ్జల గుర్తుచేశారు. తద్వారా ఇలాంటి మరిన్ని ఉపశమన చర్యలు ఈ బిల్లులో ఉండొచ్చని సజ్జల పరోక్షంగా లీకులిస్తున్నారు.
సుప్రీంకు ఏం చెప్పబోతున్నారు ?
సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా భూములిచ్చిన అమరావతి రైతులకు న్యాయం చేయాలనే విషయాన్ని గుర్తుచేసింది. దీంతో అమరావతి రైతులకు ఉపశమన చర్యలతో కొత్త బిల్లు తెస్తామనే అంశాన్ని సుప్రీంకోర్టుకు ఇప్పుడు ప్రభుత్వం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు కూడా తాజాగా కేంద్రానికి రాజధానులపై తమ అభిప్రాయం చెప్పాలని కోరింది. దీంతో రాజధానుల విషయంలో కేంద్రం నుంచి గతంలో హైకోర్టులో తమకు సహకారం లభించిన అంశం కూడా సుప్రీంకోర్టుకు ప్రభుత్వం చెప్పబోతోంది. ఈసారి సుప్రీంకోర్టులోనూ కేంద్రం అదే అఫిడవిట్ దాఖలు చేస్తే వైసీపీ సర్కార్ పని సులువవుతుంది. అలాగే మిగతా అంశాల్లో సుప్రీంకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.