వైసీపీ మరో సెల్ఫ్ గోల్- కేంద్రాన్ని కెలికి మరీ దొరికిన వైనం- విపక్షాలకు మరో అస్త్రం
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక పరిస్ధితి క్రమంగా దిగజారుతోంది. లెక్కలు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఖజానా ఖాళీ అవుతోంది. దీంతో ప్రభుత్వం అప్పుల కోసం పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు సైతం నిత్యం ఇదే అంశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ విపక్షాల విమర్శల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు పార్లమెంటులో అదే విషయాన్ని చెప్పేసింది. దీంతో ఈ వ్యవహారం విపక్షాలకు వరంగా మారబోతోంది.

అప్పులాంధ్రప్రదేశ్
ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్.. సంక్షేమం కోసం పెడుతున్న భారీ ఖర్చుతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి తలకిందులవుతోంది. అయినా పట్టించుకోకుండా ముందుకెళ్తున్న ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సిన స్ధితికి వచ్చేసింది. పరిస్ధితి గమనించిన కేంద్రం కూడా మొహం చాటేస్తోంది. దీంతో కేంద్రంతో పాటు ఆర్ధిక సంస్ధలు సైతం గ్రాంట్లు, అప్పులు ఇచ్చేందుకు సైతం నిరాకరిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆదాయం లేక, అప్పులు కూడా పుట్టక వైసీపీ సర్కార్ ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఓపిక పట్టిన వైసీపీ ఇప్పుడు పార్లమెంటులో గుట్టు విప్పేసింది.

వైసీపీ ఎంపీల బీద అరుపులు
ఏపీ ఆర్ధిక పరిస్దితి నానాటికీ దిగజారడానికి తమ ప్రభుత్వమే కారణమన్న వాస్తవాన్ని పక్కనబెట్టి పార్లమెంటులో వైసీపీ ఎంపీలు నిధుల కోసం కేంద్రాన్ని అర్ధించడం మొదలుపెట్టారు. లోక్ సభలో వైసీపీ నేత మిధున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఏపీ ఆర్ధిక పరిస్ధితిని కేంద్రానికి కుండబద్దలు కొట్టారు. విభజన కష్టాలు, కరోనా కష్టాలు అంటూ మొదలుపెట్టి అప్పులు లేకపోతే ప్రభుత్వం నడపలేని పరిస్ధితి ఉందంటూ అసలు వాస్తవం చెప్పేశారు. దీంతో కేంద్రం దీనిపై స్పందించింది.

మీరే కారణమన్న నిర్మలా సీతారామన్
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులపై స్పందించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇందుకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేశారు. ఏపీలో ఆర్ధిక పరిస్ధితి నానాటికీ దిగజారుతోందని, రెవెన్యూ లోటు పెరుగుతోందని, దీనికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలే కారణమని నిర్మల కుండబద్దలు కొట్టేశారు. దీంతో వైసీపీ ఎంపీలకు షాక్ తప్పలేదు. సంక్షేమం పేరుతో భారీగా అప్పులు చేస్తూ అభివృద్ధిని విస్మరించడమే ఈ పరిస్ధితికి కారమణమంటూ నిర్మలా సీతారామన్ తేల్చేయడంతో వైసీపీ ఇరుకునపడింది.

కెలికి దొరికిపోయిన వైసీపీ ?
ఏపీలో ఇన్నాళ్లూ ఆర్ధిక ఇబ్బందులు పెరుగుతున్నా వైసీపీ సర్కార్ మాత్రం వాటిని అప్పులతో కవర్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. మధ్యలో కాగ్ నివేదికలు తప్పుబట్టినా, వాటి ఆధారంగా విపక్షాలు టార్గెట్ చేసినా ఎదురుదాడికే పరిమితం అయింది. ఇప్పుడు ఏకంగా పార్లమెంటులోనే కేంద్రానికి అసలు పరిస్ధితి వివరించి నిధులు అడగాలని భావించిన వైసీపీ.. వాస్తవాలను వెల్లడించింది. అయితే కేంద్రం మాత్రం వాటిని పాజిటివ్ గా తీసుకోకపోవడంతో నిధుల సంగతి దేవుడెరుగు ఇప్పుడు విపక్షాలకు వైసీపీని మరింతగా టార్గెట్ చేసేందుకు అస్త్రాలు దొరికినట్లయింది.












Click it and Unblock the Notifications