నువ్వు మారవు బాబూ! చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో తాను అనుభవజ్ఞుడినని, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకారానికి తనను ఆహ్వానించిన విధానం అవమానకరంగా ఉందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనల పట్ల విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన వరుస ట్వీట్లను సంధించారు.
అత్యున్నత సంప్రదాయాన్ని పాటించిన వైఎస్ జగన్ స్థానిక, జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఫోన్ ద్వారా ఆహ్వానించారని, దాన్ని తప్పు పట్టడంలో అర్థం లేదని సాయిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ఫోన్ చేస్తున్న సమయంలో తాను పక్కనే ఉన్నానని, చంద్రబాబుకు కూడా తన ముందే ఫోన్ చేశారని చెప్పారు. చంద్రబాబు అనుభవం, సలహాలు అనే మాటలను వైఎస్ జగన్ వాడలేదని అన్నారు.
ఆయన అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసుకునేంత నీచానికి చంద్రబాబు దిగజారారని విమర్శించారు. ప్రజల ఆగ్రహం వల్ల తాను ఓడిపోలేదని, సానుభూతి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చంద్రబాబు చెప్పడాన్ని తప్పుపట్టారు. కిందపడ్డా తానే గెలిచానని అన్నట్టుంది చంద్రబాబు వాలకం అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది అన్నారు. ఓ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి 50 శాతం ఓట్లు పడిన చరిత్ర ఉందా?, దాన్ని సానుభూతి అంటారా? అని నిలదీశారు.
ఈ ఓటమితో చంద్రబాబు మానసిక స్థితి ఇంకా దిగజారినట్టుందని అన్నారు. 23 సీట్లకు పతనమైన తర్వాత అయినా పరివర్తన వస్తుందనుకుంటే ఇంకా రాలేదేంటని చంద్రబాబును ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. అనుకూల మీడియా ఉందని కలలు, ఊహలన్నిటిని రాయించుకుని తృప్తి పడుతున్నట్టున్నారని అన్నారు. జూన్ 8 వరకు పదవీ కాలం ఉందని ఇంకా నమ్ముతున్నారా? అని చురకలు అంటించారు.
చంద్రబాబు దేనిలో అనుభవజ్ణుడని ప్రశ్నించారు. కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, నయవంచన, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో తప్ప చంద్రబాబుకు ఎందులోనూ అనుభవం లేదని అన్నారు. చిత్తుగా ఓడిన తర్వాత కూడా అబద్ధాలతో ఆత్మవంచన చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సలహా విన్న వారంతా ఏమయ్యారో తెలిసి కూడా ఆయనను ఎవరైనా సలహా అడుగుతారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని వైఎస్ జగన్ హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే కథలను అల్లి మీడియాలో రాయించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు తన అనుభవాన్ని దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించారని తెలిసే వైఎస్ జగన్కు ప్రజలు పట్టం కట్టారని అన్నారు.