రంగంలో దిగిన సజ్జల భార్గవ- తొలి అస్త్రం పవన్ కల్యాణ్పైనే
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ.. రంగంలోకి దిగారు. తన పని మొదలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించిన యువ శక్తి సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు.
హాయ్ ప్యాకేజీ స్టార్..
పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు సజ్జల భార్గవ ఘాటు రిప్లై ఇచ్చారు. హాయ్ ప్యాకేజీ స్టార్, సైకో సీబీఎన్ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడులను పలకరించాు. ఇద్దరూ కలిసి డాన్సులు చేస్తోన్నారని, బహిరంగ సభల ముసుగులో ప్రజలను చంపుతున్నారని విమర్శించారు. నకిలీ, నిరాధార వార్తలను దుర్మార్గంగా వ్యాప్తి చేస్తోన్నారని ధ్వజమెత్తారు. అంత కంటే ఆ సమయాన్ని, టాలెంట్ ను ఇతర కార్యకలాపాల కోసం వినియోగించడం మంచిదని సూచించారు.
పవన్పై విమర్శల సునామీ..
పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైఎస్ఆర్సీపీ నుంచి సునామీల ఎదురుదాడి జరుగుతోంది. మంత్రులు ఆర్ కే రోజా, గుడివాడ అమర్ నాథ్, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, మేకతోటి సుచరిత ఇలా పలువురు సీనియర్ నాయకులు పవన్ కల్యాణ్ పై ఆరోపణలు గుప్పిస్తోన్నారు. సినిమా మత్తులో సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి డబ్బా మాటలతో జన సైనికులను మభ్య పెట్టొచ్చేమో కానీ జనాలను కాదని తేల్చిచెప్పారు.
సోషల్ మీడియా హెడ్ గా..
వైసీపీ సోషల్ మీడియా అత్యంత శక్తిమంతమైనదంటూ ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా వైసీపీకి అనుకూలంగా పని చేస్తోన్నారనే విషయం బహిరంగ రహస్యమే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అనంతరం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సామాన్యుల వద్దకు చేర్చడంలో సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు విస్తృతంగా పని చేస్తోన్నారు.
వైసీపీలో ట్రోల్స్..
యువ శక్తి సభ ఆరంభమైనప్పటి నుంచే జనసేన, పవన్ కల్యాణ్ పై వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలు పెట్టారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సీనియర్ నాయకుడు నాగబాబు, హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు ధీటుగా వారిని ట్రోల్స్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగంతో అదికాస్తా పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికీ దాని తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు.
కీలక హోదాలో..
అలాంటి కీలక విభాగానికి అధిపతిగా సజ్జల భార్గవను నియమించారు వైఎస్ జగన్. జాతీయ స్థాయి కార్యకలాపాలతో విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోన్నందున- ఆయనకు బదులుగా భార్గవకు ఆ బాధ్యతలను అప్పగించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ సాయిరెడ్డి ఇక పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి రాజకీయ కార్యకాలాపాలను నిర్వహించడానికి సమయాన్ని కేటాయించడానికి వీలుగా ఈ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.