మంజుల మృతి కేసులో టిడిపి నేతల ప్రమేయం: జగన్ పార్టీ
అనంతపురం: మంజుల అలియాస్ మీనాక్షి అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ శనివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద వారు ధర్నా చేశారు.
మంజులను కఠినంగా శిక్షించాలని మంజుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నిందితులుగా రాము (వెంకటరమణ చౌదరి), శ్రీనివాస్ చౌదరి ఉన్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంజుల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ అనంతపురం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శుక్రవారం డిఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతపురం శ్రీనివాస్నగర్లో అనుమానస్పద స్థితిలో మరమించిన మహిళను మెడికో మీనాక్షిగా భావించారు. అయితే, ఆమె మంజుల అని తేలింది. మంజులది అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం బత్తలపల్లి అని తెలుస్తోంది.
వడ్డే రంగమ్మ, మారెన్న దంపతుల మూడో సంతానంగా మంజుల అలియాస్ మీనాక్షిగా చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రాము చౌదరి అనే వ్యక్తి మంజులను ప్రేమించి ఇంటి నుంచి తీసుకుని వెళ్లాడని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి మూడేళ్ల వరకు మంజుల ఆచూకీ కుటుంబ సభ్యులకు తెలియదు.
ఆ తర్వాత తాను బెంగళూరులో డాక్టర్ కోర్సు చదువుతున్నానని మంజుల తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. త్వరలో ఇంటికి వస్తానని కూడా చెప్పిందట. కానీ, అది జరగలేదు. అయితే, మంజులతో వెళ్లిపోయిన రాము చౌదరి శ్రీనివాస చౌదరికి బంధువు అని తెలుస్తోంది.
వారిద్దరితో పాటు మంజుల మూడేళ్లుగా అనంతపురంలో శ్రీనివాసనగర్లో ఉంటున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట శ్రీనివాస్ చదౌరికి మంజులతో వివాహమైంది. శ్రీనివాస చౌదరి వ్యవహారాలతో మంజుల విసిగిపోయినట్లు చెబుతున్నారు. దాంతో ఇరువురి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని అంటున్నారు.
సోమవారం రాత్రి పది గంటలకు మంజుల తన నాలుగు నెలల చిన్నారితో ఇంట్లో పడుకుంది. ఆ తర్వాత మంజుల ఉరికి వేలాడి చనిపోయింది. మంజుల మృతదేహాన్ని శ్రీనివాస్ మర్నాడు అర్థరారత్రి 2 గంటలకు కారులో సర్వజనాస్పత్రికి తీసుకుని వెళ్లాడు. ఆ విషయం వార్తాపత్రికల్లో వచ్చింది. దాంతో పోలీసులు శ్రీనివాస చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.