పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో వైసీపీ హవా - రాత్రికి పూర్తి ఫలితాలు : కుప్పంలో ఉద్రిక్తత..!!
పెండింగ్ పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ రోజున పోలింగ్ నిర్వహించింది. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఇవాళ (ఆదివారం) సర్పంచ్ స్ధానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసి..కౌంటింగ్ కొనసాగుతోంది. ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో వైసీపీ హవా కొనసాగుతోంది. మొత్తం 69 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండగా..30 ఏకగ్రీవం అయ్యాయి. మరో మూడు చోట్ల ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. మిగిలిన 30 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది.
ఇక ఏకగ్రీవాలు పోగా మిగిలిన 68 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఎక్కువ మంది అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులే గెలుపొందుతున్నారు. ఇప్పటి వరకు కేవలం వార్డు సభ్యుల ఫలితాలు మాత్రమే వెలువడుతున్నాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో 5వ వార్డు మెంబర్ వైసీపీ అభ్యర్థి రామలక్ష్మీ విజయం సాధించారు.

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. పూర్తి ఫలితాలు రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో 4వ వార్డు వైసీపీ అభ్యర్థి శంకరమ్మ గెలుపొందారు. నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలం వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్ సీపీ బలపర్చిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం సాధించారు.
ప్రకాశం జిల్లాలో పలు వార్డుల్లో తమ సభ్యులు గెలిచారంటూ టీడీపీ నేతలు చెబుతుంటే... వైసీపీ నేతలు మాత్రం తాము మద్దతిచ్చిన అభ్యర్దులు గెలిచారని చెబుతున్నారు. ఇంకోల్లు మండలం పూసపాడులో 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి గోరంట్ల లక్ష్మీ తులసి గెలవగా.. తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ గెలుపొందారు. కొత్తపట్నంలో 7వ వార్డు వైసీపీ అభ్యర్థి పూరిణి సరోజిని విజయం సాధించారు. ఇక, రేపు (సోమవారం) నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అందులో కుప్పం మున్సిపాల్టీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటికీ అక్కడ టీడీపీ - వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. కుప్పంలో డబ్బులు పంచుతూ పట్టుబడ్డ వైసీపీ నేతలను వదిలేసి, టీడీపీ కేడర్ను పోలీసులు బెదిరించడం అప్రజాస్వామికమంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకోవడం నేరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. నెల్లూరులో టీడీపీ నేత శ్రీనివాసులును మంత్రి అనిల్ వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Recommended Video
వైసీపీ వేధింపులతోనే శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, శ్రీనివాసులుకు ఎలాంటి ప్రాణహాని జరిగినా మంత్రే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు.. న్యాయస్థానం ముందు తలొంచుకుని నిలబడాల్సి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.












Click it and Unblock the Notifications