కొడుకుతో పాటు వైసీపీ సీనియర్ నేతపై వేటు..!
YSRCP: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు.

అదే సమయంలో నియోజకవర్గాల అభ్యర్థులనూ ఖరారు చేస్తోన్నారు వైఎస్ జగన్. ఇప్పటికే ఆరు దశల్లో 70కి పైగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు అభ్యర్థులు/ఇన్ఛార్జీలను నియమించారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగాల్సి ఉంది. ఏడో విడత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వస్తోంది.
వైఎస్ఆర్సీపీ విడుదల చేస్తోన్న ఈ జాబితాలు అటు.. పార్టీలో అసంతృప్తికీ దారి తీస్తోంది. టికెట్ దక్కకపోవచ్చనే కారణంతో కొందరు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు డాక్టర్ సంజయ్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య వంటి నేతలు రాజీనామా చేశారు.
అదే బాటలో మరో సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య కూడా ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన గరటయ్య.. తెలుగుదేశం వైపు చూపులు సారించారు. ఇప్పటికే గరటయ్య కుమారుడు చెంచు కృష్ణ చైతన్య.. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కలిశారు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చెంచు గరటయ్య, కృష్ణచైతన్యలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడం వల్ల క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications