అశోక్ గజపతి టార్గెట్ గా వైసీపీ పావులు, చంద్రబాబు గుండెల్లో గుబులు..విజయనగరం టీడీపీ పుట్టి మునిగినట్టేనా !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా తెలుగుదేశం పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు విజయనగరం జిల్లాలో టిడిపి హవా కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది . పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు, మరోపక్క కీలక నాయకుడైన అశోక్ గజపతిరాజుపై వైసీపీ నాయకుల ఎదురుదాడి, మాన్సాస్ ట్రస్ట్ వివాదం, టిడిపి నేతలపై పెడుతున్న కేసులు వెరసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. విజయనగరం జిల్లాలో టిడిపి నాయకత్వ లేమి పై చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైంది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా అశోక్ గజపతి
విజయనగరం జిల్లాలో మొదటి నుంచి టీడీపీలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీని నడిపించే కీలక నేతగా ఆయన ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆయనను అనారోగ్య సమస్యలు వేధించడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఓ ఏడాది పాటు ఆయన ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. తర్వాత జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారు అని భావిస్తే మాన్సాస్ వివాదం ఆయనను చుట్టుముట్టింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి కూడా అడ్డంకిగా మారాయి. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది.
విజయనగరంలో టీడీపీకి నాయకత్వ లేమి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ రోజుకో రకం ఆందోళన నిర్వహిస్తున్నా , రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు టిడిపి పిలుపునిచ్చినా విజయనగరం జిల్లాలో మాత్రం ఆ కార్యక్రమాలను ముందుండి నడిపించే నాయకులు లేక పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కొంతకాలం పార్టీలో యాక్టివ్ గా పనిచేసిన ఆయన కుమార్తె అదితి గజపతి గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు యాక్టివ్ రాజకీయాలలో కాస్త దూకుడు చూపించిన అదితి గజపతి కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
మీసాల గీత, అశోక్ గజపతి మధ్య అంతర్గత పోరు , చక్రం తిప్పుతున్నమంత్రి బొత్సా
ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, అశోక్ గజపతిరాజు మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితులు పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయి. ఇక గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో ఒక్క సీటు కూడా రాకపోవటం తెలుగుదేశం పార్టీ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనే చాలామంది టిడిపి ద్వితీయ స్థాయి నాయకులు మెదులుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. పార్టీలో నాయకత్వ లేమితో వారు దిక్కులు చూస్తున్నట్లుగా సమాచారం.
మాన్సాస్ వివాదం, పాత కేసుల్లో అశోక్ గజపతిపై ఒత్తిడి
ఇక విజయనగరం జిల్లాలో టిడిపికి దిక్కైన అశోక్ గజపతిరాజు ఇప్పుడు పార్టీని నడిపించే పరిస్థితిలో లేకపోగా మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచైత గజపతిరాజును తొలగించి అశోక్ గజపతి రాజును తిరిగి నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వంపై నెగ్గాను అనుకున్న గజపతిరాజు ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ భూములను గత టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేసి అమ్ముకున్నారని, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద విచారణను నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రభావితం చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి అశోక్ గజపతిరాజును మరింత ఇరకాటంలోకి నెట్టారు.
Recommended Video
కేసుల నమోదుతో తనను తాను కాపాడుకునే యత్నంలో అశోక్ గజపతి .. జిల్లాపై చంద్రబాబు ఆందోళన
ఇప్పుడు తాజాగా మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు, స్టాఫ్ కు మధ్య జరిగిన జీతాల రగడపై ఈవో పై దాడికి ప్రేరేపించారు అనే ఆరోపణలతో అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితులు, విజయనగరం జిల్లాలో నాయకత్వ లేమి చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ కీలక నాయకులను టార్గెట్ చేసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాడి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడనివ్వటం లేదు. ఇదే సమయంలో అశోక్ గజపతిరాజు వంటి కీలక నేతలు కూడా తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో పడి, పార్టీపై దృష్టి సారించే పరిస్థితి లేదు. దీంతో విజయనగరంలో టిడిపి పుట్టి మునిగినట్టే అన్న చర్చ జోరుగా సాగుతోంది.