'చిదానంద స్వామిలా తయారయ్యిన చంద్రబాబు'
విజయవాడ : ఓవైపు తెలంగాణ ప్రభుత్వం.. గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వెళుతుంటే.. మరోవైపు చంద్రబాబు మాత్రం నోరో చక్రవర్తిలా ఫిడెల్ వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. గోదావరిపై ప్రాజెక్టుల విషయంలో.. తెలంగాణ సర్కార్ ను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించట్లేదని పద్మ మండిపడ్డారు.
గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. గోదావరి డెల్టా చుక్క నీటికి నోచుకోదని, ఇదంతా చూస్తూ కూడా చంద్రబాబు ఒక్క మాట మాట్లాడకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పద్మ. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీశారు.
రాష్ట్రానికి నీళ్లే తీసుకురాలేని చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారని పద్మ విమర్శించారు. చంద్రబాబు వ్యవహారమంతా స్వామిజీలను తలపిస్తోందన్న తరహాలో వ్యాఖ్యలు చేసిన పద్మ.. 'చిదానంద స్వామి లాగా చంద్రబాబు స్వామి గారు టెక్నాలజీ, యాప్ ల గురించి మాట్లాడడం వినడానికే విడ్డూరంగా' ఉందన్నారు.
టెక్నాలజీని అడ్డంపెట్టుకుని ప్రజల్లో మెప్పు పొందడానికి ప్రయత్నిస్తోన్న చంద్రబాబు.. హోదా విషయంలో కేంద్రం వద్ద రాజీపడిపోయారని అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎంను రాష్ట్ర ప్రజలు ఎందుకు క్షమించాలని మండిపడ్డ వాసిరెడ్డి పద్మ.. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని అనాధలా మార్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాలనపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన పద్మ.. 'ఏపీ ప్రజలకు ఎందుకింత ఖర్మ? మీ పౌరుషం ఏమైపోయింది చంద్రబాబు..? ఇప్పటికైనా కళ్లు తెరవండి, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమంటూ' చంద్రబాబును దుయ్యబట్టారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అనుమతులు తప్పనిసరి అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని ఈ సందర్బంగా పద్మ గుర్తు చేశారు.