ముందస్తుపై తేల్చేసిన సాయిరెడ్డి: ఎన్నికలపై క్లారిటీ.. గెలిచే సీట్ల లెక్క పక్కా
అమరావతి: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. జమిలి ఎన్నికల మంత్రాన్ని జపిస్తోంది. దీనికోసం తన బలబలాలను బేరీజు వేసుకుంటోంది. జమిలి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే- గెలుపోటములు ఎలా ఉండొచ్చనే విషయం మీద అంచనాలను రూపొందించుకునే పనిలో పడింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికల అనంతరం- జమిలికి వెళ్లాలా? వద్దా? అనే విషయం మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
ముందస్తు ప్రచారం..
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ప్రతిపక్షాలు రాజకీయంగా బలపడటానికి ముందే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చనే వార్తలు తరచూ వెలువడుతోన్నాయి. దీన్ని బలపరిచేలా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదివరకే స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలంటూ పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు.
పర్యటనలతో బిజీ..
ఆ దిశగా పార్టీ నాయకత్వాన్నీ సన్నద్ధం చేయిస్తోన్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. దసరా నుంచి చంద్రబాబు, మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బస్సు యాత్రను చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ, పవన్ కల్యాణ్ సారథ్యాన్ని వహిస్తోన్న జనసేన కూడా పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. పవన్ కల్యాణ్ కూడా దసరా తరువాత జిల్లా పర్యటనలకు దిగనున్నారు.
వైసీపీ హవానే..
ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే- ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 లోక్సభ స్థానాలు వస్తాయంటూ మొన్నీ మధ్యే ఇండియా టీవీ మూడ్ ఆఫ్ ది నేషన్ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. 25 లోక్సభ స్థానాలకు 19 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయకేతనాన్ని ఎగురవేస్తారని తేల్చి చెప్పింది. ఇదే ఓటింగ్ రేషియోను అసెంబ్లీ స్థానాలకు బదలాయించుకుంటే- వైఎస్ఆర్సీపీ 133 సీట్లతో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవడం ఖాయం.
20 నెలల్లో..
ఈ ఒపీనియన్ పోల్పై తాజాగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే తమకు 133 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయనేదీ ఆయన స్పష్టం చేశారు. వచ్చే 20 నెలల్లో ఎన్నికలు ఉంటాయని తేల్చి చెప్పారు. అప్పటికి తమ అసెంబ్లీ సీట్ల సంఖ్యను మరింత పెంచుకుంటామని పేర్కొన్నారు. 150కి పైగా స్థానాలతో మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు.
గడ్డి కూడా పీకలేవ్..
గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంతో ప్రజాబలాన్ని మరింత పెంచుకుంటామనీ పేర్కొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మరో ఛాన్సిస్తే పోలవరం పూర్తి చేస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయావని ఎద్దేవా చేశారు. ప్రతి సోమవారం పోలవరం టూర్లు వేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టావని మండిపడ్డారు.