ల్యాండ్ స్కామ్: 'వైసీపీ మహాధర్నా', 'ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీని వదిలేస్తా'
భూ కుంభకోణాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. భూ కుంభకోణంపై ఈ నెల 22న, విశాఖలో మహాధర్నాను నిర్వహించనున్నట్టు వైసీపీ ప్రకటించింది. భూ కుంభకోణాలపై చంద్రబాబు, లోకేష్ లు ఉన్నారని వైసీపీ ఆరో
అమరావతి: భూ కుంభకోణాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. భూ కుంభకోణంపై ఈ నెల 22న, విశాఖలో మహాధర్నాను నిర్వహించనున్నట్టు వైసీపీ ప్రకటించింది. భూ కుంభకోణాలపై చంద్రబాబు, లోకేష్ లు ఉన్నారని వైసీపీ ఆరోపించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవిని వదులుకొంటానని బుడ్డా వెంకన్న సవాల్ విసిరారు.
విశాఖలో చోటుచేసుకొన్న భూ కుంభకోణం వ్యవహరం అధికారపార్టీలో గ్రూపులను బహిర్గతం చేసింది.దీంతో ఈ విషయమై మంత్రుల మధ్య చోటుచేసుకొన్నవిబేధాలపై చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు.
అయితే ఈ అంశాన్నే తీసుకొని వైసీపీ మహధర్నాకు దిగడం రాజకీయంగా టిడిపిని ఇరుకున పెడుతోంది.విశాఖ భూ కుంభకోణం విషయంలో విపక్షాలన్నీ ఏకం కావడం టిడిపికి ఇబ్బంది కల్గిస్తోంది. ఈ తరుణంలోనే వైసీపీపై టిడిపి ఎదురుదాడిని ఎంచుకొంది.
విశాఖ భూ కుంభకోణం అంశాన్ని అధికారపార్టీపై అస్త్రంగా తీసుకొంది విపక్ష వైసీపీ.ఇదే తరుణంలో అధికారపార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడ ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది.

భూ కుంభకోణంపై విశాఖలో 22న, ధర్నా
చంద్రబాబు సర్కార్ భూ దందాలపై ఆందోళనలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 22న, విశాఖలో అఖిలపక్షంతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.శనివారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.మహాధర్నాలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడ పాల్గొంటారని చెప్పారు.భూములు కన్పిస్తే టీడీపీ నేతలు రాంబందుల్లా వాలుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే భూ కుంభకోణాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే భూ కుంభకోణాలు చోటుచేసుకొంటున్నాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. భూ కబ్జాలపై తమ పోరాటం ఆగదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రతిపక్షపార్టీ నేతలను హింసించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.విశాఖలో భూ దందాలు, కబ్జాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ , స్థానిక నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన విమర్శించారు. అన్యాయాన్ని నిలదీస్తే ప్రతిపక్షం అభివద్దికి ఆటంకం కలిగిస్తోందని విమర్శలు చేస్తున్నారన్నారు.

ఏ ఒక్కరూ కూడ తృప్తిగా లేరు
ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని బొత్స విమర్శించారు.ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదన్నారు. చంద్రబాబువి మాటలే కానీ, చేతల్లో శూన్యమని ఎద్దేవా చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అలాగే పార్టీ నేత వెల్లంపల్లి నివాసంపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవిని వదులుకొంటా
విశాఖ భూ కుంభకోణంలో ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ హస్తం ఉందని నిరూపిస్తే తాను ఎమ్మెల్సీ పదవిని వదులుకొంటానని బుడ్డా వెంకన్న వైసీపీకి సవాల్ విసిరారు. వైఎస్ఆర్ హయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ జగన్ భూ కుంభకోణాలను ఆధారాలతో తాను నిరూపిస్తానని ఆయన సవాల్ చేశారు. ఒకవేళ తాను నిరూపిస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభసభ్యత్వాన్ని వదులుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో మేఘమథనం పేరుతో వందల కోట్లను దోపిడి చేశారని ఆయన ఆరోపించారు. భూ కుంభకోణాలపై సిట్ విచారణకు చంద్రబాబునాయుడే ఆదేశాలు జారీ చేశారని ఆయన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications