త్వరలో టిడిపిలో వైసిపి విలీనం: ఆనం సంచలనం, జగన్కు అరకు ఎమ్మెల్యే షాక్
నెల్లూరు: త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో విలీనం కానుందని టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపికి భవిష్యత్తు లేదని ఆయన జోస్యం చెప్పారు.
ఆనం సోదరులు కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, టిడిపిలో ఉన్నా సంచలన వ్యాఖ్యలకు చిరునామాగా మారారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. వైసిపికి భవిష్యత్తు లేదన్నారు. వైసిపి టిడిపిలో విలీనం కానుందన్నారు.
వైసిపి నుంచి 34 మంది వస్తే, ఆ పార్టీ టిడిపిలో విలీనమైపోయినట్టేనని చెప్పారు. జగన్ జైలుకు వెళ్తాడని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారన్నారు. పార్టీ కొవ్వొత్తిలా కరుగుతోందన్నారు. వైసిపిలో తమకు భవిష్యత్ లేదని భావిస్తున్నందునే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారన్నారు.

జగన్కు అరకు ఎమ్మెల్యే ఝలక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత ఎమ్మెల్యేలు వరుసగా షాకిస్తున్నారు. ఇప్పటికే డజను మందికి పైగా ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. తాజాగా మరికొందరి పేర్లు చేరేవారి జాబితాలో వినిపిస్తున్నాయి.
కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి టిడిపిలో చేరనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతలోనే మరో ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎమ్మెల్యే ఫిరాయింపునకు రంగం సిద్ధమైందని అంటున్నారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఉదయం అరకు నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో చేరే విషయమై వారితో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, తాను ఎప్పుడు టిడిపిలో చేరుతారన్న విషయాన్ని సోమవారం నాడు ప్రకటిస్తానని ఆయన కార్యకర్తలకు చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications