కుప్పంలో గెలుస్తున్నాం - జిల్లా అధ్యక్షులకు కేబినెట్ హోదా : సర్వేలు- వారికే టిక్కెట్లు : సీఎం జగన్..!!
పార్టీ నేతలకు సీఎం జగన్ టార్గెట్ - 2024 రూట్ మ్యాప్ డిసైడ్ చేసారు. అందరూ పార్టీలో ఒకటేనని తేల్చారు. వచ్చే ఎన్నికల్లో 151 సీట్లు తగ్గకూడదని నిర్దేశించారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తిప్పికొట్టాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులకు కొత్త హోదా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మే 10వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ నిర్వహణకు నిర్ణయించారు. కుప్పంలోనూ ఈ సారి గెలవబోతున్నామంటూ చెప్పుకొచ్చారు. మంత్రులు..పార్టీ జిల్లా అధ్యక్షులు..ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపైన స్పష్టత ఇచ్చారు.

మే నుంచి గేర్ మారుస్తున్నాం
అందులో భాగంగా.. మే నుంచి పూర్తి స్థాయిలో గేర్ మారుస్తున్నామని స్పష్టం చేసారు. మే 10వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం అమలు చేయాలని నిర్దేశించారు. ప్రతీ ఇంటికి వెళ్లి..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు..వారికి అందుతున్న పథకాల గురించి వివరించాలని సూచించారు. చంద్రబాబు..ప్రతిపక్షాలతో సహా..మద్దతు మీడియా ప్రచారాన్ని ప్రతీ స్థాయిలోనూ తిప్పి కొట్టాలని సీఎం జగన్ స్పష్టం చేసారు. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్ హోదా ఇస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయన్నారు. ఇక, జిల్లా కమిటీలను సైతం జూలై 8 న నిర్వహించే ప్లీనరీ లోగా పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్దేశించారు.

జిల్లా అధ్యక్షులకు కేబినెట్ హోదా
జిల్లా కమిటీల్లో 50 శాతం బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ వర్గాలకు..అందునా 50 శాతం మహిళలకు ఇవ్వాలని ఆదేశించారు. అందరం ఒకే పార్టీ..ఒకే కుటుంబంగా ఉండాలని.. విభేదాలు పక్కన పెట్టాలని తేల్చి చెప్పారు. ప్రతీ గ్రామంలోని సచివాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించాలని..అక్కడ చేయాల్సినవి అక్కడే ఉండే పుస్తకంలో రికార్డు చేయాలని సూచించారు. ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా వారియర్లు ఉండేలా చూడాలని నిర్దేశించారు. సచివాలయలకు చేయాల్సిన పనుల గురించి సూచనలు - సలహాలు ఇవ్వాలన్నారు. తమ నియోజకవర్గాల్లో నాడు - నేడు కింద పూర్తయిన స్కూళ్లను ప్రారంభించాలని సీఎం సూచించారు.
Recommended Video


కుప్పంలో ఎమ్మెల్యే సీటు మనదే
కుప్పం నియోజకవర్గం గురించి సీఎం ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా..మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచామని.. ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ కుప్పం గెలవబోతున్నామని జగన్ చెప్పుకొచ్చారు. మంచి చేస్తున్నప్పుడు ప్రజలు గొప్ప గెలుపుతో ఆశీర్వదిస్తారని సీఎం వ్యాఖ్యానించారు. ఇక, సర్వేల ఆధారంగా పని తీరు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపైన జగన్ తన విధానం తేల్చి చెప్పారు. ప్రభుత్వ పని తీరు..పథకాల నిర్వహణ పైన సర్వేలు పాజిటివ్ గా ఉన్నాయన్నారు. కొందరు ఎమ్మెల్యేల పని తీరు పైన క్షేత్ర స్థాయిలో అంత అనుకూలంగా లేదని..వారికి తమ పరిస్థితి మెరుగుపరుచుకొనే అవకాశం ఇప్పుడు కలిగిందన్నారు.

సర్వేల ఆధారంగానే టిక్కెట్ల ఖరారు
ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తామని.. రిపోర్టుల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని తేల్చేసారు. స్థానికంగా గ్రాఫ్ పెరగకపోతే..అభ్యర్ధిని మార్చక తప్పదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపు ముఖ్యమని సీఎం జగన్ స్పష్టం చేసారు. వారంలో 2,3 రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేసారు. మీరు గెలవండి.. పార్టీని గెలిపించండి.. కావాల్సిన అన్ని వనరులు సమకూరుతాయని సీఎం జగన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications