టీడీపీలో చేరిన వైసీపీ ముస్లిం ఎమ్మెల్సీ..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ వైసీపీలో కొనసాగిన ముస్లిం ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఇక్బాల్ అనంతరం టీడీపీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరారు.
గతంలో హిందూపురం అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఇక్బాల్ ను సీఎం జగన్ అక్కడ నుంచి తప్పించినా ప్రత్యామ్నాయాలేవీ సూచించలేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన ఈ మధ్యే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అనంతరం అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని కూడా ప్రకటించారు.

అన్నట్లుగానే ఇక్బాల్ ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఓటర్లను మద్దతు కోరేందుకు ఇక్బాల్ సిద్ధమవుతున్నారు. త్వరలో టీడీపీ ప్రచారంలో ఆయన చేరబోతున్నారు. ఇక్బాల్ కు టీడీపీలో ఏ పదవి అప్పగిస్తారనేది త్వరలో నిర్ణయం కానుంది. అయితే ఎన్నికల వేళ బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమిపై ముస్లింలలో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఇక్బాల్ టీడీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications