ఆ జీవోపై సిఎస్కు నోటీసులిస్తాం: వైసిపి ఎంపి వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్: ఇతర పార్టీల పార్లమెంటు సభ్యుల విధులను కాలరాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుకు నోటీసులు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్రం ఆదేశాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ స్థానాల్లో టిడిపి ఎంపీలను నియమిస్తూ జీవోలు ఇచ్చిందని ఆయన చెప్పారు.
ఎపి ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ కేంద్రం నుంచి తనకు లేఖ కూడా అందిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. గత కొన్ని నెలలుగా టిడిపి ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల విధులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు

ఆరోగ్య మిషన్ మానిటరింగ్ చైర్మన్లుగా తమ పార్టీ పార్లమెంటు సభ్యులను కేంద్రం నియమిస్తే ఆ నియామకాలను ఎపి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన విమర్శించారు. దీనిపై న్యాయపరమైన చర్యలకు ఎట్టి పరిస్థితిలోనూ వెనకాడేది లేదని ఆయన అన్నారు.
జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి నేతలు చేస్తున్న అరాచకాలపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయింపుపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 29వ తేదీన ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఎపి బంద్ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications