విశాఖలో పాలన ప్రారంభంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ..!!
నేత..టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖే రాజధాని అని తేల్చి చెప్పారు.
ఏపీ రాజకీయం ఇప్పుడు విశాఖ చుట్టూ తిరుగుతోంది. మూడు రాజధానుల కేసు త్వరగా విచారించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును కోరింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వచ్చే నెల 28న ఏపీ రాజధానుల కేసు విచారణకు నిర్ణయించింది. విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభం అవుతుందని కొంత కాలంగా మంత్రులు చెబుతూ వస్తున్నారు. విశాఖలో ఈ నెలలో రెండు అంతర్జాతీయ సదస్సలు జరగనున్నాయి. ప్రభుత్వం వీటి నిర్వహణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించటం పైన వైసీపీ ముఖ్య నేత..టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖే రాజధాని అని తేల్చి చెప్పారు.
ఏప్రిల్ తరువాత విశాఖే రాజధాని అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. న్యాయ పరమైన చిక్కులు తొలిగించుకొని రాజధాని అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గెలుపు కోసం ఆ ప్రాంత పార్టీ ఇంఛార్జ్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి బాధ్యత తీసుకున్నారు. వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా పరిగణించాలని సూచించారు. ఇక.. విశాఖ నుంచి పాలన పైన ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు లో వచ్చే నెల 28న విచారణ ఉండటంతో..ఆ తరువాత రాజధానికి షిఫ్టింగ్ పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఉగాది నాడు సీఎం జగన్ విశాఖలో కొత్తగా క్యాంపు కార్యాలయం ప్రారంభించి..అక్కడ నుంచే పాలన వ్యవహారాలు పర్యవేక్షిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఈ నెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వంలోని ముఖ్య నేతలు భావిస్తున్నారు. కోర్టు లో స్పష్టత వస్తే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించుకొని విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, సుప్రీంకోర్టులో విచారణ ఆలస్యం అవుతుండటంతో..ఇప్పుడు కొత్త ఆలోచనల దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ విశాఖలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అసెంబ్లీ సమావేశాల వేదికగా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభం పైన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైవీ సుబ్బారెడ్డి ఏప్రిల తరువాత విశాఖే రాజధాని అని చెప్పినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications