జైట్లీ ప్రకటన టిడిపికి ఎలా తెల్సింది: ఎంపీ వైవీ, అవమానమేనని ఖాన్
న్యూఢిల్లీ: లోక్సభలో తాము లేనప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయం గురించి ప్రకటించటం మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు లోక్సభలో తమ ఉద్యమం కొనసాగుతుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మామూలుగా అయితే మధ్యాహ్నం తర్వాత సభలో గొడవ చేయడం లేదని, అందుకే తాము ఇళ్లకు వెళ్లిపోయామన్నారు. అయితే, తాము లేని సమయంలో జైట్లీ ఈ ప్రకటన చేయటం వెనుక ఉన్న అర్థమేమిటని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
తమ పార్టీ సభ్యులు బుధవారం లోక్సభ పోడియం వద్దకు వెళ్లి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. లోక్సభలో జైట్లీ ప్రకటన చేస్తారనే విషయం తెలుగుదేశం సభ్యులకు ఎవరు చెప్పారని ఆయన నిలదీశారు.
బిజెపి, తెలుగుదేశం కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం సభ్యులు బుధవారం లోక్సభలో ఉద్యమిస్తారా? లేదా? అనేది తమకు అనవసరమని చెప్పారు. తమ ఆందోళన మాత్రం కొనసాగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు.
బిజెపితో టిడిపి ఫిక్సింగ్: ఖాన్
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తెలుగుదేశం పార్లమెంటుసభ్యులు కుమ్మక్కు అయినందుకే ఏపికి ప్రత్యేక హోదా రావటం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యు డు ఎం.ఏ.ఖాన్ ఆరోపించారు. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాసిన లేఖలో ఖాన్ ఈ ఆరోపణలు చేశారు.
ఏపి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఇటీవల రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరు, బిజెపి నాయకులను పొగుడుతూ చేసిన ప్రసంగాలే ఇందుకు నిదర్శమని ఖాన్ అన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా తెలుగుదేశం ఎంపీలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను అవమానించేదిగా ఉందన్నారు.
రాజ్యసభలో జరిగిన చర్చకు సంబంధించిన వీడియో చూస్తే తెలుగుదేశం సభ్యుల వ్యవహారం ఏమిటనేది అర్థమవుతుందని ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. బిజెపి-తెలుగుదేశం పార్టీల నిజ స్వరూపం ఏపి ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినా ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నదని ఖాన్ చెప్పారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.