రైతులతో చెలగాటమా?, రాజీనామా చెయ్యాలి: బాబుపై బుగ్గన, వైవీ ధ్వజం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైవీ విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ రైతాంగం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సామాజిక అధ్యయనాల సంస్థ(సెస్) బయటపెట్టిందని వైవీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రైతాంగం పరిస్థితి దారుణంగా ఉందని సెస్ నివేదిక తెలపడంతో సీఎం చంద్రబాబు మాటలయన్నీ బడాయిలేనని తేలిపోయిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రైతులు అప్పుల్లో మునిగిపోయారని నివేదిక వెల్లడించినట్లు తెలిపారు.
రెండంకెల వృద్ధిరేటు అని, వ్యవసాయ మిషన్ అని గొప్పలు చెబుతున్నారని, అయితే అవన్నీ పచ్చి అబద్ధాలని సెస్ నివేదిక బయటపెట్టిందన్నారు. అమరావతి జపమే తప్ప, వ్యవసాయాన్ని ఏడాది పట్టించుకోలేదని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతుల జీవితాలతో చెలగాటమాటొద్దని హెచ్చరించారు. ః
సెస్ నివేదికతోనైనా చంద్రబాబు కళ్లు తెరిచి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలని కోరారు.
వెంటనే రాజీనామా చేయాలి: బుగ్గన
స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడాన్ని హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టినట్లు చెప్పారు.
అయితే, కోర్టు తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించి, ఆ తర్వాత పిటిషన్ ను ఉపసంహరించుకుని, చట్టానికి సవరణలు చేసిందని గుర్తు చేశారు. తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పడం దారుణమన్నారు. గతంలో సీఎంలుగా పని చేసిన సంజీవరెడ్డి, జనార్ధన్ రెడ్డిలు ఆ ఆయా సందర్భాల్లో కోర్టులు తప్పిన నేపథ్యంలో రాజీనామా చేశారని, చంద్రబాబు కూడా అలాగే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో ఓటును డబ్బు పెట్టి కొనుగోలు చేయడం తప్పుకాదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. మరి, ఈ నేరాన్ని ఏ చట్టం కింద నమోదు చేయవచ్చో ఆ న్యాయవాదే చెబితే బాగుంటుందని బుగ్గన ఎద్దేవా చేశారు.