అమరావతికి బిగ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ..! ఐదేళ్ల తర్వాత మళ్లీ..
ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతికి కొత్త కళ వస్తోంది. ముఖ్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పాగా వేసేందుకు వచ్చిన సంస్థలన్నీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్లాన్ తో వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు తిరిగి మళ్లీ అమరావతి బాట పడుతున్నాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు టీడీపీ కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనలకు ఆఘమేఘాల మీద ప్రధాని మోడీ ఆమోదం తెలుపుతున్నారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రాజధానిలో తమ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. దీంతో అమరావతిలో ఈ సంస్థ కోసం అప్పటి టీడీపీ సర్కార్ రెండెకరాలు స్థలం కూడా నామమాత్రపు ధరకు లీజుకు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు కూటమి సర్కార్ రాకతో మళ్లీ ఈ సంస్థతో సీఆర్డీయే జరిపిన సంప్రదింపులు ఫలించాయి.

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జడ్ఎస్ఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో అమరావతి రాజధానిలోని రాయపూడి పంచాయతీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకొచ్చారు. ఈ మేరకు సీఆర్డీయేతో సంప్రదింపులు జరపడమే కాకుండా డబ్బులు కూడా చెల్లించి బిల్డింగ్ ప్లాన్ సమర్పించింది.
త్వరలో సీఆర్డీయే దీనికి ఆమోదం తెలిపితే కార్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో వివిధ జంతుజాతుల మనుగడపై అధ్యయనాలు చేసే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం రాక శుభసూచికం కానుంది.












Click it and Unblock the Notifications