టీమిండియాను కుంగదీసిన టూమచ్ క్రికెట్: కొంప ముంచిన ఐపీఎల్: అలిసిపోయాం..: బుమ్రా
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత క్రికెట్ జట్టు మరో అవమానకర ఓటమిని చవి చూసింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో చేతులెత్తేసింది. భారీ స్కోర్తో ప్రత్యర్థిని కంగారు పెట్టాల్సిన టీమిండియా.. నామమాత్రపు స్కోర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్స్లో అడుగుపెట్టాలంటే.. ఇకపై ప్రతి మ్యాచ్నూ గెలవాల్సిన పరిస్థితిని సృష్టించుకుంది. మరో జట్టు ఓడితే గానీ- కోహ్లీసేన ముందుకు సాగడం కష్టం.

మూడు ఒకట్ల టార్గెట్ను
సూపర్ 12 దశలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్.. ఓ చేదు ఓటమిని మిగిల్చింది. ఆదివారం సాయంత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బ్లాక్ క్యాప్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులే చేసింది. 111 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. ఛేజింగ్కు దిగిన కివీస్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది.

18 ఏళ్ల రికార్డును నిలబెట్టుకున్న న్యూజిలాండ్..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన టోర్నమెంట్లల్లో బ్లాక్ క్యాప్స్పై భారత జట్టు గెలిచి 18 ఏళ్లయింది. 2003 తరువాత ఐసీసీ టోర్నీల్లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ను కూడా గెలవనివ్వలేదు న్యూజిలాండ్. ఆ రికార్డును ఇక్కడా కొనసాగించింది. బారత జట్టు చేతిలో చివరిసారిగా 2003లో ప్రపంచకప్ టోర్నమెంట్లో ఓడింది కివీస్. ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ టీ20 ప్రపంచకప్లొోనూ అదే ఆనవాయితీని, వారసత్వాన్ని కొనసాగింపజేశాడు కేప్టెన్ కేన్ విలియమ్సన్.

మూడుకు మూడు గెలవడమే కాకుండా..
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు ఇది వరుసగా రెండో ఓటమి. కిందటి నెల 24వ తేదీన పాకిస్తాన్ చేతిలో ఓడింది. మళ్లీ సరిగ్గా అదే ఆదివారం బ్లాక్ క్యాప్స్ చేతిలో. ఈ రెండు ఓటములు టీమిండియాను టోర్నమెంట్లో ముందుకు సాగలేని పరిస్థితిని కల్పించాయి. ముందరి కాళ్లకు బంధం వేశాయి. ఇంకా మూడు మ్యాచులను ఆడాల్సి ఉంది భారత జట్టు. సెమీస్కు అడుగు పెట్టాలంటే ఈ మూడింట్లోనూ తప్పనిసరిగా భారీ రన్రేట్తో గెలవడంతో పాటు తోటి జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది.

హేమాహేమీలు నిండా వున్నా..
టీమిండియా.. ఏ జట్టుకూ తీసిపోని విధంగా ఉంది. బలమైన బ్యాటింగ్ లైనప్, అదే స్థాయిలో బౌలింగ్ వనరులను కలిగి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లో మెరుపులను మెరిపించగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. పైగా- అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. దూకుడుకు పెట్టింది పేరైన విరాట్ కోహ్లీ- జట్టుకు నడిపిస్తున్నాడు. అయినప్పటికీ.. కీలక మ్యాచ్లల్లో, గెలిచి తీరాల్సిన పోటీలో చేతులెత్తేసింది.

టూ మచ్ క్రికెట్..
భారత జట్టు మితిమీరిన క్రికెట్ ఆడుతోందని, అందుకే ఈ వరుస ఓటములు పలకరించాయనే వాదన వినిపిస్తోంది. టూ మచ్ క్రికెట్ జట్టును దెబ్బ తీసిందని అంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్కు సిద్ధం కావాల్సి రావడం, కనీస విశ్రాంతి దొరక్కపోవడం ప్లేయర్లను మానసికంగా.. శారీరకంగా కుంగదీసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టైట్ షెడ్యూల్ దెబ్బ తీసిందని అభిమానులు చెబుతున్నారు.

బీసీసీఐ పాత్ర ఎంత..?
కోహ్లీసేన.. తీరిక లేని క్రికెట్ ఆడుతోందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్ స్టేడియంలో ఈ ఏడాది జూన్లో న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తరువాత.. 40 రోజులకు పైగా భారత ప్లేయర్లు విశ్రాంతి తీసుకన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి ఇప్పటిదాకా అంటే నాలుగు నెలలుగా విరామం లేని క్రికెట్ ఆడుతూ వస్తోన్నారు. కనీస రెస్ట్ దొరకట్లేదు. ఇంతటి టైట్ షెడ్యూల్ను రూపొందించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కారణమని, టీమిండియా ఓటముల్లో బీసీసీఐ పాత్ర కూడా ఉందని అంటున్నారు.

టెస్ట్ సిరీస్ వెంటనే ఐపీఎల్..
ఇంగ్లాండ్తో అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ముగిసీ ముగియంగానే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వాలిపోయారు. నెలరోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్లను ఆడారు. ఐపీఎల్ టోర్నీ ముగియగానే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను ఆడాల్సి వచ్చింది. కిందటి నెల 15వ తేదీన ఐపీఎల్ ఫైనల్ ముగియగా.. అదే నెల 24వ తేదీన ఈ వరల్డ్కప్ మొట్టమొదటి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీ కొట్టాల్సి వచ్చింది. పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనేది తెలుసు. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఒత్తిళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండింటీనీ ఎదుర్కొనలేకపోయారు భారత ప్లేయర్లు.

రెస్ట్ అవసరం..
టీమిండియా బౌలింగ్ వెన్నెముక జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలు.. ప్లేయర్లపై ఉన్న ఒత్తిళ్లను స్పష్టం చేస్తోన్నాయి. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన అతను తమ శరీరాలు అలిసిపోయాయని, బ్రేక్ కావాలంటూ చెప్పుకొచ్చాడు. దీనికి తోడు క్వారంటైన్ కూడా కొంత మానసిక ఒత్తిళ్లకు గురి చేసింది. బయో బబుల్ వ్యవస్థ దీనికి తోడయింది. ఈ పరిస్థితుల్లో మిగిలిన మ్యాచ్లల్లో భారత జట్టు సానుకూల ఫలితాలను సాధిస్తుందనేది ప్రశ్నార్థకమే అయింది.












Click it and Unblock the Notifications