రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ''అద్భుతహా!!''
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మక రాజకీయాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎకరం భూమి 10 కోట్లరూపాయలకు విక్రయించడంద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా, తనకు కలిసివచ్చేలా మూడురకాల వ్యూహాలను రూపొందించుకుందని చెబుతున్నారు.
రూ.5వేల కోట్లు సమకూర్చుకోవాలంటే కత్తిమీద సామే!!
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరునెలల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటుచేసి రైతులకు చెందిన ప్లాట్లన్నింటినీ అప్పగించాలి. కానీ అందుకు ఆరునెలల సమయం సరిపోదని, మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం అవసరమైన సౌకర్యాలను కల్పించాలంటే రూ.5వేల కోట్లవుతుందని అంచనా. అంత నగదు అంటే ప్రభుత్వానికి కష్టం. సీఆర్డీయేనే ఆ రూ.5వేల కోట్లు సమకూర్చుకోవాలి. ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేద్దామంటే బ్యాంకులకు కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడంలేదు. దీంతో సీఆర్డీయే కు రూ.5వేల కోట్లు సమకూర్చుకోవడమంటే కత్తిమీద సాములాంటిదే.!!
మేం ముందే చెప్పాం కదా..
దీంతో ఎకరా భూమి రూ.10కోట్లకు అమ్మకానికి పెట్టింది. రాజధానిలో ఎవరైనా ఎకరం భూమి అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. దీన్నిబట్టి మొదటి నుంచి తాము చెబుతున్నట్లు ఇక్కడ రాజధాని నిర్మిస్తే మునిగిపోతుందని, చంద్రబాబునాయుడి ఎంపిక తప్పని తాము మొదటినుంచి చెబుతూనే ఉన్నామని, ఇది స్మశానమని ముందే చెప్పామని, అందుకే కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని చెప్పడానికి ఒక అవకాశం దొరికినట్లవుతుందని వైఎస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారు.
జగన్ మీద ఉన్న నమ్మకంతోనే కొనుగోలు?
ఒకవేళ సీఆర్డీఏ ప్రకటన ప్రకారం ఎవరైనా భూములు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మీద ఉన్న నమ్మకంతోనే కొనుగోలు చేస్తున్నారని, అన్నీ ఆలోచించే రూ.10 కోట్ల ధర నిర్ణయించామని, తాము అమరావతిని అభివృద్ధి చేయమని చెప్పలేదు కదా.. శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పాంగా.. ఆ ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నాయి.. ఇదంతా ప్రభుత్వ ఘనత అని చెప్పుకోవచ్చని నేతలు భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో దేశంలో ఇప్పడున్న ముఖ్యమంత్రులందరితో పోలిస్తే జగన్మోహన్రెడ్డే ముందువరుసలో ఉంటారని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతుండటం విశేషం.