Asia Cup 2023: టోర్నీ మధ్యలోనే హుటాహుటిన ఇంటి దారి పట్టిన బుమ్రా- భార్య పక్కనే ఉండేలా..!!
ముంబై: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా మ్యాచ్లను ఆడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్తో మ్యాచ్ ముగించుకుంది టీమిండియా. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయింది. ఒక్కో పాయింట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన తదుపరి మ్యాచ్లో నేపాల్ను ఎదుర్కొనబోతోంది.
పల్లెకెలె స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 266 పరుగులకు ఆలౌట్ అయింది. కేప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ.. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ నిలబెట్టిన మ్యాచ్ ఇది. హార్దిక్ పాండ్యా- 87, ఇషాన్ కిషన్- 82 పరుగులతో చెలరేగారు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్ ముగిసిన తరువాత భారీ వర్షం పడటంతో మ్యాచ్ రద్దయింది.

ఇక తన రెండో మ్యాచ్లో టీమిండియా.. నేపాల్ను ఎదుర్కొనబోతోంది. ఈ నెల 5వ తేదీన షెడ్యూల్ అయింది ఈ మ్యాచ్. పల్లెకెలె స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా జరుగనుంది. పసికూన జట్టు కావడం వల్ల ఈ మ్యాచ్ ఏకపక్షమౌతుందనే అంచనాలు ఉన్నాయి. వర్షం అడ్డుపడి మ్యాచ్ రద్దయితే మాత్రం మళ్లీ ఒక్క పాయింట్నే సరిపెట్టుకోవాల్సి వస్తుంది భారత్కు.
ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడట్లేదు. ఈ ఒక్క మ్యాచ్కే కాదు.. లీగ్స్ అన్నింటికీ దూరం అయ్యాడు. ఉన్నఫళంగా శ్రీలంక నుంచి ముంబైకి చేరుకున్నాడు బుమ్రా. దీనికి కారణం లేకపోలేదు. ఆయన భార్య సంజన గణేషన్.. త్వరలోనే ప్రసవించబోతోంది. బిడ్డకు జన్మనివ్వబోతోంది.
ఈ సమయంలో భార్య పక్కనే ఉండాలనే కారణంతో లంక నుంచి తిరిగి వచ్చేశాడు బుమ్రా. మళ్లీ సూపర్ 4 మ్యాచ్ల నాటికి జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ లోపే సంజన గణేషన్ డెలివరీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నెల 9, 10, 12, 14, 15 తేదీల్లో సూపర్ 4 మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. అవన్నీ కొలంబోలోనే జరుగనున్నాయి.
ఇక 17వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరుగనుంది. మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో- ఫైనల్ సహా ఆయా మ్యాచ్లన్నింటినీ పల్లెకెలె లేదా దంబుల్లాలకు తరలించవచ్చు. ఈ మ్యాచ్లు మొదలయ్యే నాటికి జస్ప్రీత్ బుమ్రా.. జట్టుకు అందుబాటులోకి వస్తాడు.












Click it and Unblock the Notifications