పక్క రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికీ వ్యాక్సిన్: స్టాక్ ఉన్నంత వరకే
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్క రోజు వ్యవధిలో 47,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 490 మంది మరణించారు. 31,796 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం పాజిటివ్ కేసులు 19,34,378కు చేరుకోగా ఇందులో మంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 13,51,097. యాక్టివ్ కేసులు 5,64,485గా నమోదయ్యాయి. 18,776 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ఇన్ని వేల సంఖ్యలో నమోదవుతోన్న కరోనా కేసులను అడ్డుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను విధించింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది.
Recommended Video
కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటూనే.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేసింది యడియూరప్ప సర్కార్. మూడోదశ వ్యాక్సిన్ డ్రైవ్ను చేపట్టింది. 18 సంవత్సరాలు నిండిన వారికీ వ్యాక్సిన్ అందజేసే కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టనుంది. ఈ ఉదయం 10 గంటలకు దీన్ని ప్రారంభించనుంది.

మూడోదశ వ్యాక్సినేషన్ కింద 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి టీకాలను వేయనుంది. వ్యాక్సిన్ కొరతను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా మాత్రమే అర్హులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. వాక్ ఇన్ రిజిస్ట్రేషన్ను అమలు చేయట్లేదని తెలిపింది. కోవిన్ ద్వారా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్న వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసింది. అది కూడా పరిమిత కేంద్రాల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంది.
బెంగళూరులో కేసీ జనరల్ ఆసుపత్రి, జయనగర జనరల్ ఆసుపత్రి, సర్ సీవీ రామన్ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, ఈఎస్ఐ ఆసుపత్రి, నిమ్హాన్స్లో మాత్రమే 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేస్తామని తెలిపింది. ఇతర చోట్ల జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, తాలూకా ఆసుపత్రుల్లో 18 ప్లస్ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టినట్లు వివరించింది.
వ్యాక్సిన్ నిల్వలను దృష్టిలో ఉంచుకుని.. వాటి సంఖ్యను పెంచుతామని తెలిపింది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లదలిచిన వారికి సంపూర్ణ లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సిన్ వేయించుకోదలిచిన వారు తమ మొబైల్ ఫోన్కు అందిన మెసేజీలను పోలీసులకు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications