టీ ఎస్టేట్ కూలి..తాగుబోతు: భార్య పుట్టింటికి: పెట్రోల్ పోసి నిప్పు: బయట గొళ్లెం: ఆరుమంది దహనం
బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య తరఫు కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ఆమె సోదరుడి కుటుంబాన్ని మంటల్లో తగులబెట్టాడు. ఈ ఘటనలో ఆరుమంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నపిల్లలు ఉండటం స్థానికంగా విషాదాన్ని నింపింది, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
టీ ఎస్టేట్ కార్మికుడి ఘాతుకం..
కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం మడికెరి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంపేట్లో నివసించే ఎరవార బోజ అనే 50 వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడ్డాడు. నిందితుడు బోజ.. స్థానిక ఓ టీ ఎస్టేట్లో దినసరి వేతన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస. భార్యతో తరచూ అతను గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికొచ్చిన ప్రతీసారీ ఆమెను చితకబాదేవాడు. భర్త పెట్టే చిత్రహింసను భరించలేక ఆమె కొంతకాలంగా అదే గ్రామంలో నివసించే సోదరుడు మంజు ఇంట్లో ఉంటోంది.
పెంకులు తొలగించి.. పెట్రోల్ పోసి..
సాయంత్రం అతను మళ్లీ మద్యం సేవించి, మంజు ఇంటికెళ్లాడు. తన భార్యను పంపించాల్సిందిగా పట్టుబట్టాడు. అతను దానికి అంగీకరించలేదు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. బావ, బావమరిది ఇద్దరు ఘర్షణ పడ్డారు. స్థానికులు వారిని నచ్చజెప్పడంతో శాంతించారు. తన ఆగ్రహాన్ని అణచుకోలేని బోజ అర్ధరాత్రి దాటిన తరువాత మంజు ఇంటికెళ్లాడు. పెంకులు తొలగించి, నిద్రిస్తోన్న వారిపై పెట్రోల్ చల్లాడు. నిప్పంటించి పరారయ్యాడు.
ఆర్తనాదాలతో
ఆ సమయంలో ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నారు. వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. బయటికి వెళ్లలేక అగ్నికి అహూతి అయ్యారు. ముగ్గురు సంఘటనా స్థలంలో సజీవ దహనం అయ్యారు. అప్పటికే బోజ బయటి వైపు గొళ్లెం పెట్టి ఉండటంతో బయటపడలేకపోయారు. ఆ సమయంలో వారు పెట్టిన కేకలు, ఆర్తనాదాలు విని మంజు బంధువు తోళ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. నలుగురిని కాపాడగలిగాడు. వారిని మైసూరు ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బోజ కోసం గాలిస్తెున్నారు. తోళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో బోజ భార్య బేబీ, అత్త సీత, ప్రార్థన అనే ఆరేళ్ల బాలిక సంఘటనా స్థలంలో మరణించారు. మంజు కుమారులు ప్రకాష్, విశ్వాస్, మరో బాలుడు మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. మైసూరు ఐజీ ప్రవీణ్ మధుకర్ పవార్, కొడగు ఎస్పీ క్షమా మిశ్రా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.