వైఎస్ జగన్ పథకానికి బీజేపీ సర్కార్ జై: మక్కీ కి మక్కీగా అమలు: ముహూర్తం ఫిక్స్
బెంగళూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మహిళల సంరక్షణ కోసం అమలు చేసిన దిశ చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన బిల్లును అసెంబ్లీలో సైతం ప్రవేశపెట్టింది. దిశ చట్టానికి సంబంధించిన ముసాయిదా ప్రతులను కేరళ ప్రభుత్వం తెప్పించుకుంది.

ఏపీ పథకాలపై ఫోకస్..
ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉద్దేశించిన నాడు-నేడు పథకంపై తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ అధ్యయనం చేస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతినెలా తెల్లరేషన్ కార్డుదారులకు అందజేసే నిత్యావసర సరుకులను లబ్దిదారుల ముంగిట్లోకి చేర్చడానికి ఉద్దేశించిన ఇంటింటికీ రేషన్ బియ్యం పథకాన్ని ఇదివరకే ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా- కర్ణాటక ప్రభుత్వం ఈ జాబితాలో చేరింది.

రిపబ్లిక్ డే నుంచి రాష్ట్రవ్యాప్తంగా..
చౌకడిపోల ద్వారా నిత్యావసర సరుకులను లబ్దిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేయడానికి కర్ణాటక సమాయాత్తమౌతోంది. దీనికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొద్దిరోజుల కిందటే దావణగెరెలో దీనికి సంబంధించిన ఓ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలను తెప్పించుకుంటున్నామని, వచ్చే మూడు నెలల్లో దీన్ని ప్రారంభిస్తామని అన్నారు.

1 నుంచి పైలెట్ ప్రాజెక్ట్..
జనసేవక్ పేరుతో ఈ పథకాన్ని తొలుత పైలెట్ ప్రాజెక్ట్గా 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీన బెంగళూరు అర్బన్ జిల్లా సహా ఎంపిక చేసిన 28 పట్టణాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ఇందులో నెలకొనే ఇబ్బందులు, సాంకేతికపరమైన లోటుపాట్ల గురించి తెలుసుకుంటుంది. వాటని సవరించి- జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది.

జనసేవక్ స్కీమ్..
జనసేవక్ పథకం కింద ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారుల ఇళ్ల వద్దకే చేర్చడానికి కసరత్తు చేస్తున్నామని బసవరాజ్ బొమ్మై ఇదివరకే స్పష్టం చేశారు. గతంలో బీఎస్ యడియూరప్ప హయాంలో ఈ తరహా వ్యవస్థను అమలు చేయడానికి అధ్యయనం జరిగింది. అప్పట్లో అది అమలు కాలేదు. ముఖ్యమంత్రి మారిన తరువాత.. అదే వ్యవస్థను ప్రభుత్వం మళ్లీ తెరమీదికి తీసుకొచ్చింది. ఈ జనసేవక్ వ్యవస్థలో భాగంగానే ఇంటింటికీ రేషన్ డెలివరీని అమలు చేస్తామని ప్రకటించింది.
Recommended Video

లగేజీ ఆటోల్లో..
రేషన్ బియ్యాన్ని లబ్దిదారుల ఇళ్ల వద్దకు చేరవేయడానికి ఏపీలో జగన్ సర్కార్.. ప్రత్యేకంగా వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా కర్ణాటక ప్రభుత్వం లగేజీ ఆటోలను అద్దెకు తీసుకోనుంది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని.. దీని పరిధిలో ఉన్న రేషన్ దుకాణాల సంఖ్యకు అనుగుణంగా లగేజీ ఆటోలను సమకూర్చుతుంది. దీనికి అవసరమైన అద్దెను జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చెల్లిస్తారు. బిల్లులను చౌకడిపో డీలర్లు స్థానిక అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications