Rohini Sindhuriపై యడియూరప్ప సర్కార్ బదిలీ వేటు: ఆ కీలక శాఖలో పోస్టింగ్: తోటి ఐఎఎస్పైనా
బెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. బదిలీ అయ్యారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసింది. రోహిణి సింధూరిపై ఘాటు ఆరోపణలు సంధిస్తూ.. ఏకంగా తన సర్వీసుకే రాజీనామా చేసిన తోటి ఐఎఎస్ అధికారిణి శిల్పా నాగ్ను కూడా వదల్లేదు యడియూరప్ప సర్కార్. ఆమెను కూడా బదిలి చేసింది. వారిద్దరితో పాటు మొత్తం ఏడుమంది ఐఎఎస్ అధికారులకు కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మైసూరు జిల్లా కలెక్టర్గా..
2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్కు చెందిన రోహిణి సింధూరి ప్రస్తుతం మైసూరు జిల్లా కలెక్టర్గా పని చేస్తోన్నారు. మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న తోటి ఐఎఎస్ అధికారిణి శిల్పా నాగ్ ఆమెపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. డిప్యూటీ కమిషనర్ (కలెక్టర్) హోదాలో ఆమె తనపై రోజూ ప్రభుత్వానికి, ఉన్నతాదికారులకు ఫిర్యాదు చేస్తున్నారంటూ శిల్పా నాగ్ ఆరోపించారు. విధి నిర్వహణలో తనపై రోజూ ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఆమె వేధింపులు భరించలేక ఏకంగా తన సర్వీసుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

శిల్పా నాగ్ రాజీనామా.. తిరస్కరణ
జిల్లాలో అధికారులెవరూ స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం లేదని, కీలక హోదాల్లో ఉన్న అధికారులపై రోహిణి సింధూరి పెత్తనం చలాయించాలని ప్రయత్నిస్తున్నారంటూ శిల్పా నాగ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె తన ఐఎఎస్ సర్వీస్కు రాజీనామా చేశారు. దాన్ని ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఈ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ రాజీనామాను భావోద్వేగం, ఆగ్రహావేశాల మధ్య తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్లు తెలిపింది. రోహిణి సింధూరి-శిల్పా నాగ్ మధ్య గొడవ చోటు చేసుకున్న మూడోరోజే మైసూరు నుంచి ఇద్దరినీ బదిలీ చేసింది. బెంగళూరుకు రప్పించింది.

రోహిణి సింధూరికి దేవాదాయ శాఖ
కాగా- తాజాగా రోహిణి సింధూరిని దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించింది ప్రభుత్వం. దేవాదాయ శాఖ కమిషనర్గా పనిచేస్తోన్న దయానందను బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ప్రత్యేక కమిషనర్గా బదిలీ చేసింది. రోహిణి సింధూరి స్థానంలో మైసూరు జిల్లా కలెక్టర్గా డాక్టర్ బాగాడి గౌతమ్ను నియమించింది. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నులు (ఎన్ఫోర్స్మెంట్) అదనపు కమిషనర్గా పని చేస్తోన్నారు. ఈ ఉత్తర్వులన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
Recommended Video

గ్రామీణాభివృద్ధి శాఖకు శిల్పా నాగ్
ఈ వివాదంలో రోహిణి సింధూరిపై ఆరోపణలు గుప్పించిన ఎంసీసీ కమిషనర్ శిల్పా నాగ్ను కూడా బదిలీ చేసింది. ఆమెను గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్ శాఖ ఈ-గవర్నెన్స్ విభాగం డైరెక్టర్గా నియమించింది. శిల్పా నాగ్ స్థానంలో కర్ణాటక ఆహార, పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డిని మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేసింది. బీబీఎంపీ హెల్త్ అండ్ ఐటీ విభాగం స్పెషల్ కమిషనర్గా ఉన్న పీ రాజేంద్ర చోళన్ను బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ (బెస్కాం) మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. బీబీఎంపీ హెల్త్ అండ్ ఐటీ విభాగం స్పెషల్ కమిషనర్గా అదనపు బాధ్యతలను అప్పగించింది.












Click it and Unblock the Notifications