పదవి పదిలం కోసం అట్నుంచి నరుక్కొస్తోన్న యడియూరప్ప: బరిలో లింగాయత్, మఠాధిపతులు
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఉద్వాసన తప్పదంటూ కొద్దిరోజులుగా మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడుతోన్నాయి. ఇటీవలే ఆయన హస్తిన పర్యటనకు వెళ్లొచ్చిన తరువాత ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో ఆయన సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రత్యర్థులు విమర్శలు, ఆరోపణాస్త్రాలను సంధిస్తోన్న నేపథ్యంలో- యడియూరప్పను సాగనంపుతారనే ప్రచారం సాగింది. కరోనా వైరస్ తీవ్రత సద్దుమణిగిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పుపై దృష్టి సారించిందని తెలుస్తోంది.
Recommended Video


భవితవ్యం తేలేది 26న
ఈ నెల 26వ తేదీన భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశమే యడియూరప్ప భవిష్యత్తును నిర్ణయిస్తుందనేది బహిరంగ రహస్యం. కొత్త నేతను ఎన్నుకోవడానికే కర్ణాటక బీజేఎల్పీ సమావేశం కానున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. బీజేఎల్పీ సమావేశంలో సభ్యులు.. తమ నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటారనేది సస్పెన్స్గా మారింది. యడియూరప్పకు ఉద్వాసన తప్పదనే విషయం తేలడంతో సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పావులు కదుపుతున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నిర్వహిస్తోన్నారు.

యడ్డీకి అండగా.. మఠాధిపతులు..
ఈ పరిణామాల మధ్య పలువురు మఠాధిపతులు యడియూరప్పకు అండగా నిలుస్తోన్నారు. ఆయనకు తమ నైతిక మద్దతు తెలియజేస్తోన్నారు. ఈ మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్న పీఠాధిపతులు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బీఎస్ యడియూరప్పతో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా వారి మధ్య సమావేశం కొనసాగింది. 30 మందికి పైగా వేర్వేరు పీఠాలకు చెందిన అధిపతులు వారంతా. ఎట్టి పరిస్థితుల్లోనూ యడియూరప్పను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్రశాఖ నాయకులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి వీరశైవ లింగాయత్లు
మరోవంక- యడియూరప్ప సామాజిక వర్గానికి చెందిన వీరశైవ లింగాయత్ ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. రాజకీయాలకు అతీతంగా వీరశైవ లింగాయత్లు యడ్డీకి మద్దతు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. శ్యామనూర్ శివశంకరప్ప, ఎంబీ పాటిల్ వంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు యడియూరప్పకు మద్దతు ఇస్తోన్నారు. వారితోపాటు మరికొందరుకాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్)లో కొనసాగుతోన్న వీరశైవ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు యడియూరప్పను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తోన్నారు. బీజేపీలో యడ్డీ తరువాత ఆ స్థాయిలో బలమైన నేతలెవరూ లేరనేది వారి వాదన.

అభిప్రాయ సేకరణ దిశగా..
ఇదివరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ను ఏరకంగానైతే బీజేపీ అధిష్ఠానం ఢిల్లికి పిలిపించుకుని ఉద్వాసన పలికిందో.. అదే తరహాలో యడియూరప్పకు సాగనంపుతారనే ప్రచారం సాగుతోంది. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్ఠానం.. యడియూరప్పకు ఉద్వాసన పలికే విషయంపై అభిప్రాయ సేకరణ చేపట్టినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల నుంచి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకుని, దానికి అనుగుణంగా తన తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications