Karnataka Next CM : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై..? మళ్లీ లింగాయత్ వర్గానికే సీఎం పీఠం..?
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బసవరాజ్కే సీఎం పదవి కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. లింగాయత్ వర్గానికే సీఎం పదవిని కట్టబెట్టాలా లేక మరో సామాజికవర్గంతో ప్రయోగం చేయాలా అని తర్జనభర్జన పడ్డ బీజేపీ అధిష్ఠానం చివరకు బసవరాజ్ బొమ్మై వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరీ బసవరాజ్ బొమ్మై...
బసవరాజ్ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998,2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత నమ్మకస్తుడిగా చెబుతారు. పార్టీలో చాలామంది ఎమ్మెల్యే మద్దతు కూడా బసవరాజ్ బొమ్మైకి ఉండటంతో ముఖ్యమంత్రిగా ఆయన్నే ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
యడియూరప్పతో బొమ్మై భేటీ...
మంగళవారం(జులై 27) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంత్రులు బసవరాజ్ బొమ్మై,ఆర్.అశోక సీఎం యడియూరప్పతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అదే సమయంలో పలువురు లింగాయత్ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైని కలిసి ఆయన నాయకత్వానికి మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై బసవరాజ్ బొమ్మైని మీడియా ప్రశ్నించగా... తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటికైతే తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. తమది జాతీయ పార్టీ అని... వివిధ స్థాయిల్లో నిర్ణయాల తర్వాత అంతిమ నిర్ణయం ఉంటుందని చెప్పారు.
ఈ రాత్రికి తేలిపోనుంది...
బీజేపీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఈ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాత్రి 7గంటల సమయంలో బీజేపీ అధిష్ఠానం పంపించిన ముగ్గురు అబ్జర్వర్లు కర్ణాటక ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్,కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,ధర్మేంద్ర ప్రధాన్లు ఎమ్మెల్యేలతో భేటీ అయి చర్చిస్తారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని... సమర్థత,సామాజిక సమీకరణాలు,పార్టీ భవిష్యత్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్దిగంటల్లో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది.
యడియూరప్ప రాజీనామాతో...
ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప సోమవారం(జులై 26) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన అసమ్మతి,వయోభారం కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత వారం బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడి పెద్దల ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే నాయకుడి కోసం ప్రస్తుతం బీజేపీ అన్వేషిస్తోంది.