పొరుగు రాష్ట్రంలో పబ్లు, క్లబ్లు, బార్లు రేపట్నుంచే ఓపెన్: కరోనా నిబంధనలు పాటిస్తూ..
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో పలు సడలింపులను ప్రకటించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో క్లబ్బులు, పబ్బులు, బార్లు తెరుచుకుంటాయని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వాటికి అనుమతిచ్చినట్లు తెలిపింది.
సెప్టెంబర్ 1 నుంచి క్లబ్బులు, పబ్బులు, బార్లు ఓపెన్..
అన్లాక్ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా పబ్బులు, బార్లు, క్లబ్బులను తెరిచేందుకు కర్ణాటక ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్బులు, క్లబ్బులు, బార్లలో మద్యం విక్రయాలను అనుమతిస్తామని.. అయితే, సీటింగ్ సామర్థ్యంలో సగ ఖాళీగా ఉంచాలని కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి నాగేశ్ స్పష్టం చేశారు.
సగం సీట్లు ఖాళీగా ఉంచాల్సిందే..
కరోనా నేపథ్యంలో సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఖాళీ ఉంచడంతోపాటు భౌతిక దూరం సహా ఇతర కోవిడ్-19 నిబంధనలను పాటించాలని తెలిపారు. కాగా, కరోనావైరస్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు 1435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
ఇప్పటికే ప్రభుత్వానికి భారీ నష్టం..
గత సంవత్సరం ఇదే సమయంలో ప్రభుత్వానికి వచ్చిన రాబడితో పోల్చితే ఇంత మొత్తంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని అంచనా వేశామని మంత్రి నాగేశ్ తెలిపారు. మద్యం విక్రయాలకు అనుమతించని పక్షంలో నష్టాలు రూ. 3000 కోట్ల దాటతాయని అన్నారు. కాగా, గత జూన్ నెలలోనే కర్ణాటక ప్రభుత్వం మద్యం షాపులు తెరిచేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతిచ్చింది.
కర్ణాటకలో భారీగా కరోనా కేసులు
ఇది ఇలావుంటే, కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 3,00,406 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83,608 యాక్టివ్ కేసులున్నాయి. 2,11,688 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 5,091 మంది కరోనా బారినపడి మరణించారు. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది కర్ణాటక.