ద్విపాత్రాభినయం.. ఇటు ప్రధాని.. అటు ఆర్థికశాఖ.. తాత నుంచి మనుమడి వరకు..
న్యూఢిల్లీ: బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తుది పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. 2017లో జీఎస్టీ అమలులోకి తెచ్చిన తర్వాత తొలి.. 2016లో నోట్ల రద్దు అమలు చేసిన తర్వాత కేంద్రం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ప్రధాని నరేంద్రమోదీ ముందే చెప్పినట్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రజాకర్షక విధానాలు కనిపించకపోవచ్చు.
ఇప్పటికే పలు ఆర్థిక సంస్కరణల అమలు దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్న మోదీ సర్కార్.. బడ్జెట్ లోనూ అదే పంథా అనుసరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే బడ్జెట్ సమర్పణ సంప్రదాయం ఈనాటిది కాదు. ఈస్టిండియా కంపెనీ ఫైనాన్స్ మెంబర్ జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ ఏడో తేదీన తొలిసారి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు.
నెహ్రూ బాటలోనే ఆయన తనయ ఇందిర
స్వతంత్ర భారతావనికి తొలి ప్రధానిగా నిర్విఘ్నంగా బాధ్యతలు నిర్వహించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1958 - 59 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. అదే బాటలో ఆయన తనయ, ఉక్కు మహిళగా పేరొందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 1970 - 71 ఆర్థిక సంవత్సరానికి ప్రధాని కం ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించి రికార్డు నెలకొల్పారు. అంతే కాదు అతి కొద్దికాలం పాటు మాత్రమే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది.
వీపీ సింగ్ వైదొలగడంతో ఆర్థిక మంత్రిగా రాజీవ్ సేవలు ఇలా
ఇక తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మనుమడు, ఉక్కుమహిళ ఇందిరాగాంధీ తనయుడు రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రిగానూ, ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. బోఫోర్స్ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి విశ్వనాథ ప్రతాప్ సింగ్ నిష్క్రమించారు. దీంతో 1987 - 88 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంట్కు రాజీవ్ గాంధీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ సమర్పించారు. అంతే కాదు భారత కార్పొరేట్, ఎన్నారై పారిశ్రామికవేత్తలపై కార్పొరేట్ ట్యాక్స్ విధించి మరీ సంచలనం కలిగించిన ఘనత కూడా రాజీవ్ గాంధీదే అంటే అతిశయోక్తి కాదు. కాగా, దేశంలోనే అత్యధికంగా 10 బడ్జెట్లు సమర్పించిన నేత మొరార్జీ దేశాయి. 1964, 1968ల్లో ఫిబ్రవరి 29వ తేదీన తన జన్మదినోత్సవం నాడు రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత కూడా మొరార్జీ దేశాయ్ సాధించారు. తర్వాత 1977లో జనతా పార్టీ హయాంలో ప్రధానిగా పని చేశారు.
పీవీ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ పూర్తి బడ్జెట్
తొలిసారి ఇద్దరు మంత్రులు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ తాత్కాలిక, పూర్తిస్థాయి బడ్జెట్లు పార్లమెంట్ కు సమర్పించారు. 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వం పతనమైంది. దీంతో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటి చంద్రశేఖర్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా యశ్వంత్ సిన్హా.. తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1991 ఎన్నికల తర్వాత పీవీ నర్సింహారావు క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా ప్రస్తుత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతోపాటు దేశానికి ఆర్థిక సంస్కరణలను పరిచయం చేసిన నేతగా రికార్డు నెలకొల్పారు. తద్వారా ఆధునిక భారత నిర్మాణానికి పద నిర్దేశం చేశారు.
1982లో 95 నిమిషాల్లోనే బడ్జెట్ పూర్తి చేసిన ప్రణబ్
తొలి దశలో బడ్జెట్ పత్రాలు ఇంగ్లిష్ భాషలోనే తయారు చేసే వారు. తర్వాత 1955 - 56 నుంచి హిందీ భాషలో తయారు చేయడం ప్రారంభించారు. 1965 -66లో తొలిసారి నల్లధనం వెలికితీయడానికి తొలిసారి పథకం ప్రవేశపెట్టారు. 2016లో నోట్ల రద్దు పథకం అమలులోకి తెచ్చిన తర్వాత 2017 - 18 ఆర్థిక సంవత్సరంలోనూ ఇటువంటి పథకమే ప్రవేశపెట్టారు. భారతదేశ బడ్జెట్లలో తొలిసారి రూ.550 కోట్ల ద్రవ్యలోటు ప్రతిపాదించిందీ 1973 - 74 బడ్జెట్ లోనే కావడం గమనార్హం. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 1994 - 95లో తొలిసారి ఐదు శాతం సర్వీస్ టాక్స్ ప్రవేశపెట్టారు. తర్వాత దేశ జీడీపీలో అది 40 శాతంగా నిలిచింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1982లో ఆర్థిక మంత్రిగా 95 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించేశారు.
1950లో తొలి బడ్జెట్ సమర్పణ ఘనత మథాయిదే
భారతీయ రిజర్వు బ్యాంక్ తొలి గవర్నర్ గానూ, దేశ ఆర్థిక మంత్రిగానూ సీడీ దేశ్ ముఖ్ తొలిసారి 1951 - 52లో తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. ఇక 2017 - 18లో రైల్వేశాఖతోపాటు అన్ని రంగాలకు ఒకే బడ్జెట్ ప్రతిపాదించిన ఘనత అరుణ్ జైట్లీకి వర్తిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో అదే ఏడాది నవంబర్ 26న ఆర్థిక మంత్రిగా ఆర్ కే శణ్ముఖం చెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1950 ఫిబ్రవరి 28న రిపబ్లిక్ భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత జాన్ మాథాయికి దక్కుతుంది.
తాత్కాలిక బడ్జెట్ నుంచి సంస్కరణలు, సంప్రదాయాల్లో తనదైన ముద్ర
ఆర్థికశాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హాకు పలు రికార్డులు ఉన్నాయి. 1991లో చంద్రశేఖర్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. అదీ అంతర్జాతీయంగా కరంట్ ఖాతా లోటు (క్యాడ్) ఏర్పడింది. ఫారెక్స్ నిధుల సంక్షోభం నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమర్పించారు. తిరిగి 1999లో పోఖ్రాన్ అణ్వస్త్ర పరీక్షల తర్వాత తలెత్తిన విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ సమర్పించారు. తర్వాత కార్గిల్ వార్ ముగిసిన తర్వాత 2000లో, గుజరాత్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన భూకంపం నేపథ్యంలో 2001లో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన నేతగా యశ్వంత్ సిన్హా మిగిలిపోతారు. బ్రిటిష్ వలస పాలన హయాంలో చివరి వర్కింగ్ డే నాడు సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టార. కానీ బ్రిటన్ లో మధ్యాహ్నమే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం బడ్జెట్ సమర్పించే సంప్రదాయాన్ని అమలులోకి తెచ్చిందే యశ్వంత్ సిన్హా.