‘మహారాజా’ బరిలో ఇండిగో ప్లస్ ఖతార్: ఇక ఇంటికే డీజిల్ సప్లై
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ 'ఎయిర్ ఇండియా' వాటాల కొనుగోలుకు రంగం సిద్ధం అవుతున్నది. ఆ దిశగా చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో, ఖతార్ ఎయిర్వేస్ కలిసి ఏర్పాటు చేయనున్న కన్సార్షియం.. ఎయిరిండియా కొనుగోలుకు బిడ్ దాఖలు చేసే ఆస్కారం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్డింగ్ దాఖలు చేయాలంటే బిడ్డర్ల నికర విలువను రూ. 1000 కోట్లని నిర్దేశించవచ్చునంటున్నారు. అందుకు అనుగుణంగా ఈ రెండు విమానయాన సంస్థలు చేతులు కలిపి ఒక ప్రైవేట్ ఈక్విటీ భాగస్వామిగా గానీ, వెల్త్ఫండ్ భాగస్వామ్యంలో కన్సార్షియం గానీ ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ఇండిగోతోపాటు విదేశీ ఎయిర్ లైన్స్ నుంచి అధికారిక ఆసక్తి వెల్లడి
ఎయిరిండియా వాటాల విక్రయం ప్రక్రియను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయవలసి ఉండగా ఇండిగో, ఒక విదేశీ ఎయిర్లైన్స్ సంస్థ నుంచి అధికారికంగా ఆసక్తి వ్యక్తీకరణ దాఖలయిందని పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. ఎయిరిండియాలో ప్రభుత్వం 24 శాతం వాటాను తన వద్దనే ఉంచుకోవచ్చని కూడా అంటున్నారు.
జెట్ ఎయిర్ వేస్ నుంచి ఎయిర్ ఫ్రాన్స్, డెల్టా కన్సార్టియం వరకు ఆసక్తి
కాగా, ఎయిరిండియా విక్రయానికి సంబంధించిన విధివిధానాలతో ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే ఆస్కారం ఉంది. జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్ఎం, డెల్టా ఎయిర్లైన్స్ కన్సార్షియం ఎయిరిండియా కొనుగోలు పట్ల గట్టి ఆసక్తి కలిగి ఉన్నదని చెబుతున్నారు. త్వరలోనే ఈ కన్సార్షియం కూడా బిడ్ దాఖలు చేయవచ్చు.
ఎయిర్ ఫ్రాన్స్ తో కలిసి జెట్ ఎయిర్ వేస్ దూకుడు ఇలా
అదే నిజమైతే ఎయిరిండియా కొనుగోలు కోసం జెట్ ఎయిర్వేస్, ఇండిగో సారథ్యం వహిస్తున్న రెండు కన్సార్షియంల మధ్య గట్టి పోటీయే ఉంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఎయిర్ఫ్రాన్స్ కెఎల్ఎంతో నరేశ్ గోయెల్ సారథ్యంలోని జెట్ ఎయిర్వేస్ సహకార భాగస్వామ్యాన్ని విస్తరించుకున్న నాలుగు నెలల వ్యవధిలోనే ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఎయిరిండియా భారీ రుణాల ఊబిలో కూరుకుపోయిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆ సంస్థను దక్కించుకున్న వారికి ప్రపంచంలో త్వరితగతిన విస్తరిస్తున్న భారత మార్కెట్లో బలంగా అడుగుపెట్టే అవకాశం ఏర్పడుతుంది. కొనుగోలుదారుకు ద్వైపాక్షిక హక్కులు కూడా అందుబాటులోకి వస్తాయి.
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, ఎఐఎస్ఎటిఎస్ గా జాయింట్ వెంచర్
ఎయిరిండియాను నాలుగు వేర్వేరు విభాగాలుగా విడదీసి ఒక్కో విభాగాన్ని వేర్వేరుగా విక్రయించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఎయిరిండియాకు చెందిన చౌక ధరల విమానయాన విభాగం ఎయిరిండియా ఎక్స్ప్రెస్, దాని అనుబంధ సంస్థ ఎఐఎస్ఎటిఎస్ ఒక విభాగంగా ఆఫర్ చేయవచ్చు. ఇందులో ఎఐఎస్ఎటిఎస్ ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ ఎస్ఎటిఎస్ మధ్య సమాన వాటాలు గల జాయింట్ వెంచర్గా ఉంది.
ఆసక్తిగల సంస్థలతో సంప్రదిస్తున్నామన్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా
ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వేర్వేరు సంస్థలుగా విక్రయించే ఆస్కారం ఉంది. ఎయిరిండియా, అనుబంధ సంస్థ ల కొనుగోలు పట్ల ఆసక్తి గల పలు వర్గాలతో తాము చర్చలు జరుపుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా గత నెలలోనే ప్రకటించారు. ఈ వ్యూహాత్మక విక్రయాన్ని మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా జాతీయ విమానయాన సంస్థలో విదేశీ సంస్థల పెట్టుబడికి ఎఫ్డిఐ పరిమితిని కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జనవరిలో 49 శాతానికి పెంచింది. ఎయిరిండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ విభాగం ఎఐఎటిఎస్ఎల్ కొనుగోలు పట్ల గత ఏడాదిలోనే బర్డ్ గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది.
ఇలా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డోర్ డెలివరీ ఆఫర్
ఇక నుంచి డీజిల్ అయిపోతే వాహనాలను తోసుకుంటూ పెట్రోల్ బంకుల దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దేశంలో అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) డీజిల్ను డోర్డెలివరీ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు. ‘డోర్ డెలివరీ కింద డీజిల్ తీసుకొచ్చే విధానాన్ని తొలిసారి ప్రయోగాత్మకంగా పుణెలో ప్రారంభించాం. ప్రజల నుంచి దీనికి మంచి స్పందన వస్తే మరిన్ని నగరాలకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడు నెలల పాటు ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపడతాం. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్వో) దగ్గర నుంచి క్లియరెన్స్ పొంది ఇంటికే డీజిల్ వచ్చే సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి కంపెనీ మాదే' అని సింగ్ పేర్కొన్నారు.
షాపింగ్ మాల్స్, ట్రాన్స్ పోర్టు సంస్థలు లక్ష్యంగా ఈ సదుపాయం
త్వరలోనే పెట్రోల్ కూడా ఇంటి వద్దకే తీసుకొచ్చే సదుపాయాన్ని తీసుకొస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. డీజిల్ వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన షాపింగ్ మాల్స్(డీజిల్ జనరేటర్), ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, అత్యధికంగా డీజిల్ వినియోగం చేసే సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఐఓసీ మాదిరిగానే మరో రెండు చమురు సంస్థలు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) కూడా పీఈఎస్వో క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి.
దేశీయ చమురు వాడకంలో 40 శాతం వాటా డీజిల్దే
క్లియరెన్స్ వచ్చిన వెంటనే ప్రయోగాత్మకంగా పెట్రోల్, డీజిల్ ఇంటి వద్దకే సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. గంటల తరబడి పెట్రోల్ బంకుల ముందు క్యూలో నిలబడి పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు పాట్లు పడకుండా ఉండేందుకు హోం డెలివరీ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గతేడాది ఏప్రిల్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్లో 61,983 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 2016-17 ఏడాదిలో దేశంలో 194.6 మిలియన్ టన్నుల చమురు వినియోగం జరిగింది. అందులో 40శాతం వినియోగం డీజిల్దే.